వైసీపీ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిపాయి సుబ్రమణ్యం
ABN , First Publish Date - 2023-02-21T01:54:51+05:30 IST
ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పేరును వైసీపీ ప్రకటించింది.
తిరుపతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పేరును వైసీపీ ప్రకటించింది. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు పదవీకాలం పూర్తికావడంతో ఈ స్థానానికి సుబ్రమణ్యం పేరు ఖరారు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న ఆయన అయిదు రోజుల కిందట ఆ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆయనకు ఈ అవకాశం దక్కడం విశేషం. జిల్లాలోని స్థానిక ఓట్లలో 95 శాతానికి పైగా వైసీపీవే కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది. తిరుపతిలోని రష్ ఆసుపత్రి అధినేతగా సిపాయి సుబ్రహ్మణ్యం సుపరిచితులు. పెనుమూరు మండలం మోపిరెడ్డిపల్లి ఆయన స్వస్థలం. తాను చదివిన ఎస్వీ మెడికల్ కాలేజీలోనే ప్రొఫెసర్గానూ, యూరాలజీ విభాగం అధిపతిగానూ పనిచేశారు. 2004-05 నడుమ ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా పనిచేశారు. 2005-06లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పాలకమండలి సభ్యుడిగానూ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పాలక మండలి సభ్యుడిగా, ఎస్వీయూ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్లో మెడికల్ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్గా కూడా పనిచేశారు. అమెరియన్ యూరాలజిస్టు అసోసియేషన్లో ఆయనకు అంతర్జాతీయ సభ్యత్వం వుంది.
15 ఏళ్ళుగా రాజకీయాల్లో....
వన్యకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం 15 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుంచీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రె్సలో విలీనం అయ్యాక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014-19 నడుమ టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్గా క్యాబినెట్ హోదా పదవిని అనుభవించారు. అలాగే ఏపీ ఎంఎ్సఐడీసీ డైరెక్టర్గా కూడా పనిచేశారు.