రాజా గణపతి.. రథ విహారం
ABN , First Publish Date - 2023-09-26T01:42:52+05:30 IST
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వినాయకస్వామికి రథోత్సవాన్ని నిర్వహించారు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 25: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వినాయకస్వామికి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకర్లవారిపల్లెకు చెందిన దివంగత ఎత్తిరాజులు నాయుడు, శివప్రసాద్ జ్ఞాపకార్థం మీనాకుమారి, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం పూర్ణచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ వీఎం, దివంగత చంద్రశేఖర్రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు హరిప్రసాదరెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్కు అభిషేకం నిర్వహించారు. సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవర్లను సుందరంగా అలంకరించి.. బ్రహ్మరథంపై అధిష్ఠింపచేశారు. ఉదయం సంప్రదాయ బద్ధంగా రఽథాన్ని భక్తులు, ఉభయదారులు కొంతదూరం లాగి భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు బ్రహ్మరథంపై ఉప్పు, బొరుగులు, మిరియాలు, చిల్లర నాణేలు చల్లి, కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రథాన్ని పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్రెడ్డి, ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్బాబు, ఆలయ ఇన్స్పెక్టర్లు బాబు, సురేష్, ఉభయదారులు పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు
మంగళవారం ఉదయం ఆలయం వారు భిక్షాండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరుకల్యాణం నిర్వహణకు కాణిపాకం, తిరువణంపల్లెకు చెందిన వణిగ వంశస్థులు.. రాత్రి జరిగే అశ్వవాహన సేవకు బొమ్మసముద్రం, తిరువణంపల్లె, చింతమాకులపల్లె,కారకాంపల్లె గ్రామాలకు చెందిన గోనగుంట బలిజ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.