అమ్మవారి ఆలయ ఉద్యోగిపై పోలీసుల విచారణ వేగవంతం
ABN , First Publish Date - 2023-01-30T01:30:02+05:30 IST
పద్మావతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్జిత ఇన్స్పెక్టర్ దామోదర్ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శేషాద్రిపై దాడి చేసిన విషయంలో తిరుచానూరు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
తిరుచానూరు, జనవరి 29: పద్మావతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్జిత ఇన్స్పెక్టర్ దామోదర్ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శేషాద్రిపై దాడి చేసిన విషయంలో తిరుచానూరు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా పోలీసులు ఆదివారం అమ్మవారి ఆలయానికి చేరుకుని సంఘటన జరిగిన సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, అధికారుల స్టేట్మెంట్ను రికార్డు చేశారు. దాడి ఘటనలో సాక్షులను కూడా విచారించారు. ఘటనకు సంబంధించిన కీలక సాక్ష్యాలు, సీసీపుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్పై దాడి చేసిన పరికరాన్ని స్వాధీనం చేయాలని ఆలయ అధికారులను కోరారు. దామోదర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. భక్తులు వచ్చే ప్రాంతంలో ఓర్పుతో విధులు నిర్వహించాలని, పోలీసుపై దాడి చేయడాన్ని టీటీడీ కూడా సీరియ్సగా తీసుకుంది. దామోదర్పై చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఉన్నతాధికారులు విచారణ చేయిస్తున్నారు. విజిలెన్స్ అధికారి ఆలయానికి చేరుకుని ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న సుబేదారు, ఆలయ ఉద్యోగుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. సోమవారం ఉన్నతాధికారులకు ఇవ్వనున్నారు. ఒకటి రెండు రోజుల్లో దామోదర్పై టీటీడీ అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.