పీఎల్ఆర్ టిప్పర్లా!
ABN , First Publish Date - 2023-11-24T00:59:54+05:30 IST
జిల్లాలో తిరిగే పలు టిప్పర్లకు నెంబర్లు ఉండవు. కానీ ముందూ వెనుక ‘పీఎల్ఆర్’ అని ఉంటుంది. వీటిని పోలీస్, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులు ఆపే ధైర్యం చేయరు. తనిఖీలు, ప్రశ్నించడాలూ ఉండవన్నది బహిరంగ రహస్యమే.
నెంబరు ఉండదు.. ఢీకొన్నా కేసులుండవు
జిల్లాలో తిరిగే పలు టిప్పర్లకు నెంబర్లు ఉండవు. కానీ ముందూ వెనుక ‘పీఎల్ఆర్’ అని ఉంటుంది. వీటిని పోలీస్, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులు ఆపే ధైర్యం చేయరు. తనిఖీలు, ప్రశ్నించడాలూ ఉండవన్నది బహిరంగ రహస్యమే. ఈ టిప్పర్లు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీవి. పుంగనూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ పలుచోట్ల తిరిగే ఈ కంపెనీ టిప్పర్లలో చాలావరకు రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేట్లు ఉండవు. వివిధ రకాల నిర్మాణ, అభివృద్ధి పనులకు సంబంధించిన మెటీరియల్, ఇసుక, మట్టి తదితరాలను ఈ టిప్పర్లు తరలిస్తుంటాయి. ద్విచక్ర వాహనాలకు ముందువైపు నెంబరు ప్లేటు లేకపోయినా అపరాధ రుసుం విధించే పోలీసులు, అధికారులు ఈ టిప్పర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఈ టిప్పర్లలో ఒకటి గురువారం పుంగనూరు నక్కబండలో రోడ్డు పనులకు మట్టి లోడ్తో బయలుదేరింది. అదే సమయంలో ఆటో డ్రైవర్ మురాధి ఇంటి ముందు ఆటో పెట్టి భోజనం చేస్తున్నారు. పీఎల్ఆర్ కంపెనీకి చెందిన నెంబరులేని టిప్పర్.. రోడ్డు పక్కన ఉన్న ఆటోను (ఏపీ03యూ8535) ఢీకొంది. టిప్పర్ వెనుక చక్రాలకింద ఆటో బోల్తాపడింది. పీఎల్ఆర్ టిప్పర్ కావడంతో ఈ ఘటన పోలీసు స్టేషన్ వరకు వెళకుఉండా, దెబ్బతిన్న ఆటోను మరమ్మతుల నిమిత్తం తరలించినట్లు తెలిసింది. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. కాగా నెంబరులేని పీఎల్ఆర్ వాహనం ఆటోను ఢీ కొన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కొందరు వైరల్ చేశారు.
- పుంగనూరు