విద్యుత్‌ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం

ABN , First Publish Date - 2023-05-26T02:08:26+05:30 IST

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

 విద్యుత్‌ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం

తిరుమల, మే 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. డౌన్‌ ఘాట్‌ రోడ్డులోనూ కాంక్రీట్‌తో రీటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చైర్మన్‌ గురువారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలపై అధికారులతో చర్చించారు. చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ బస్సులో సాంకేతిక ఇబ్బందులేమీ లేవని ఓలెక్ర్టా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారమిచ్చారన్నారు. అతివేగం లేదా డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణమై ఉండచ్చని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్‌ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని సూచించారు. టీటీడీ సీవీఎస్వో నరసింహకిశోర్‌, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, ఓలెక్ర్టా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T02:08:26+05:30 IST