కొనసాగుతున్న సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె
ABN , Publish Date - Dec 23 , 2023 | 02:12 AM
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్షలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారమూ కొనసాగింది.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 22: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్షలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారమూ కొనసాగింది. కలెక్టరేట్ ముందు ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నేతలు సప్తగిరి ప్రసాద్, అమర్నాథ్, బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జదీశ్వర్నాయుడు, శ్రీనివాసులు, ఫ్యాప్టో ఛైర్మన్ మునాఫ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్నాయుడు సంఘీభావం ప్రకటించారు. సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి తక్కువ జీతంతో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మినిమం టైం స్కేల్తో పాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలన్నారు. మహిళా ఉద్యోగులు గొబ్బిళ్లు పాటలు పాడి నిరసన తెలిపారు. సమ్మెలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసులు, విల్వనాథం, దేవరాజు, ప్రకాష్, గీత, నదీశ్వరి, శరత్బాబు తదితరులు పాల్గొన్నారు.