ఇసుక గుంతలో పడి ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-06-07T02:05:53+05:30 IST
ఇష్టారాజ్యంగా జరిపిన ఇసుక తవ్వకాల్లో ఏర్పడిన గుంతలో జారి పడిన వ్యక్తి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది.
తవ్వకాలను ఆపాలంటూ
రుద్రవరంవాసుల ఆందోళన
చిట్టమూరు, జూన్ 6 : ఇష్టారాజ్యంగా జరిపిన ఇసుక తవ్వకాల్లో ఏర్పడిన గుంతలో జారి పడిన వ్యక్తి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక తవ్వకాలు ఆపాలని రుద్రవరం గ్రామస్తులు ఆందోళన చేపట్టగా వారి పట్ల ఎస్ఐ జులుం ప్రదర్శించడం ఉద్రిక్తత పెంచింది. చిట్టమూరు మండలం, మెట్టు స్వర్ణముఖి నది వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్వాపరాలిలా.....మెట్టు సమీపంలో స్వర్ణముఖి నది పారుతోంది. ఇసుక డంపింగ్ యార్డులకు ఇక్కడినుంచి ఇసుకను తరలిస్తున్నారు.మీటరు లోతునే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఉత్తర్వులున్నప్పటికీ అధికార పార్టీ అండదండలతో 10 అడుగుల లోతున ఇసుక తవ్వేసి తరలిస్తున్నారు.కోట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వంట మాస్టరు ముత్యాలయ్య(45) సోమవారం రాత్రి మెట్టు వద్ద బస్సు దిగాడు. స్వర్ణముఖి నదిలో రుద్రవరం వెళ్లే కాలిబాటలో వెళ్తూ ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గుంతలో జారి పడిపోయాడు.పదడుగుల లోతులో పడిపోయి బయటకు రాలేక మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఇసుక క్వారీలో శవమై తేలడం తెలిసి రుద్రవరం గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇసుక క్వారీ వల్లే ముత్యాలయ్య చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు.ఇసుక తవ్వకాలు వద్దని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినకపోవడం వల్లే నిండు ప్రాణం బలైపోయిందంటూ నాయుడుపేట-కోట రహదారికి తాటిమాను అడ్డంగా వేసి ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలం చిట్టమూరు మండలమైనప్పటికీ కోట ఎస్ఐ పుల్లారావు అక్కడకు చేరుకొని గ్రామస్తుల పట్ల జులుం ప్రదర్శించారు. కేసులు పెట్టి జైలు పాల్జేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చిట్టమూరు ఎస్ఐ లక్ష్మీభవాని సమయస్ఫూర్తితో తహసీల్దార్ శ్రీనివాసులుకు సమాచారమిచ్చి పిలిపించారు. వారిద్దరూ గ్రామస్తులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
==================================