ఆగని గజదాడులు

ABN , First Publish Date - 2023-06-03T01:33:06+05:30 IST

పంటపొలాలపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. ఐరాల, బంగారుపాళ్యం మండలాల్లో గురువారం రాత్రి స్వైరవిహారం చేశాయి.

ఆగని గజదాడులు
చుక్కావారిపల్లెలో ఏనుగులు ధ్వంసం చేసిన పూరిగుడిసె

ఐరాల/బంగారుపాళ్యం, జూన్‌ 2: పంటపొలాలపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. ఐరాల, బంగారుపాళ్యం మండలాల్లో గురువారం రాత్రి స్వైరవిహారం చేశాయి. ఐరాల మండలం చుక్కావారిపల్లెలో ప్రతిరోజూ ఏనుగుల గుంపు పంటటపొలాలపై దాడిచేసి రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి రఘునాథరెడ్డి మామిడి తోటలో ఏనుగులు స్వైరవిహారం చేశాయి. మామిడి చెట్లను విరచి, కాయలు ఆరగించి, తోటలోని పూరిగుడిసెను ధ్వంసం చేశాయి. మామిడి వ్యాపారి బాలాజీ ద్విచక్రవాహనాన్ని తోటనుంచి బయటకు విసిరేశాయి.

బంగారుపాళ్యం మండలం బండ్లదొడ్డి సమీపంలోని చీకలగుట్ట వద్ద నాలుగు ఏనుగుల గుంపు గురువారం రాత్రి పద్మనాభంకు చెందిన మామిడి కొమ్మలను విరిచేసి, సుమారు టన్ను మామిడి కాయలను, డ్రిప్‌ పైపులను ధ్వంసంచేసింది. యువరాజ్‌, రమేశ్‌, సోము, మోహన్‌ రాజ్‌లకు చెందిన మామిడి పంటలను ధ్వంసం చేసాయి. మూడు రోజులుగా పంటపొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయని అటవీశాఖ అధికారులకు తెలియపరచినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోయారు. గజదాడుల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అటవీ ప్రాంత సమీపంలోని మామిడిరైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2023-06-03T01:33:06+05:30 IST