నేదురుమల్లిని వెంకటగిరిలో ఫుట్బాల్ ఆడిస్తా
ABN , First Publish Date - 2023-06-26T01:44:32+05:30 IST
వెంకటగిరిలో వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని ఫుట్బాల్ ఆడిస్తానని స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వెంకటగిరి, జూన్ 25: వెంకటగిరిలో వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని ఫుట్బాల్ ఆడిస్తానని స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన రెండు ఎన్నికల్లో ఆయన ప్రతాపం చూశామన్నారు. తన తల్లి రాజ్యలక్ష్మి పోటీచేసిన సమయంలో ఫుట్బాల్ ఆడబోయి కాళ్లు విరగ్గొట్టుకున్నాడు. మరోసారి తానే పోటీకొచ్చి.. ఫుట్బాల్ ఆడబోయి ముక్కూ మొహం చెక్కలైందని ఎద్దేవ చేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఆడాలనుకుంటే మాకొచ్చే ఇబ్బంది లేదన్నారు. మాకు ఆయనకున్నంత ప్రావీణ్యం లేకపోయినా 2024 ఎన్నికల్లో మాత్రం ఫుట్బాల్ ఆడిస్తానని చెప్పారు. ఈ దఫా ఫుట్బాల్ ఆడేవారిని తయారు చేస్తానని దాంతో ఆయనకు ఏమి జరుగుతుందో మాకైతే తెలియదని రామ్కుమార్రెడ్డిని పరోక్షంగా హెచ్చరించారు. చదివినంత మాత్రాన సరిపోదని సంస్కారం కావాలన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా తాను జస్ట్ ఆరు మాసాలు మాత్రమే గ్యాప్ ఇచ్చానని ఈ సమయంలో ఇక్కడ జరిగిన పరిస్థితులను ప్రజలు అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఏ ఇంటి తలుపు తట్టినా ఇక్కడ అధికార పార్టీ పరిస్థితి ఏమిటో కథలు కథలుగా చెబుతారని అన్నారు. ‘అక్కడ తంతాను ఇక్కడ తంతానంటే పడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు. నీకే దిక్కులేదు. రెండుసార్లు తన్నబోయి బోర్లా పడ్డావు.. నిన్ను తన్నేందుకు ఇక్కడికి మేము రావాల్సిన అవసరం లేదు’ అని ఆనం అన్నారు. వెంకటగిరి ప్రాంతంలో మనం వాడాల్సిన భాష ఏ విధంగా ఉండాలో నేర్చుకోవాలని హితవు పలికారు. ఇక్కడి ప్రజలు చాలా తెలివైన వారని, పూర్వం సంస్థానాధీశుల కింద పెరిగినటువంటి వారన్నారు. అందువల్ల సంస్కార హీనులను వెంకటగిరి ప్రజలు ఎప్పటికీ ఆదరించరని స్పష్టం చేశారు.