మూషిక వాహనంపై లంబోదరుడు
ABN , First Publish Date - 2023-09-22T01:07:07+05:30 IST
కాణిపాక బ్రహోత్సవాలలో భాగంగా గురువారం మూషిక వాహనంపై వినాయకస్వామి ఊరేగారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 21: కాణిపాక బ్రహోత్సవాలలో భాగంగా గురువారం మూషిక వాహనంపై వినాయకస్వామి ఊరేగారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, అగరంపల్లె, కాణిపాకపట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామికి చందనాలంకారం నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురావడంతో అలంకార మండపంలో ఉత్సవర్లకు పూజలు చేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లను మూషిక వాహనంపై అధిష్ఠింపచేసి కాణిపాకం పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు, ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్లు బాబు, సురేష్ ఉభయదారులు పాల్గొన్నారు.
వరసిద్ధుడికి పట్టు వస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లన్న, శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయ అధికారులు వినాయకస్వామికి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అతిథి గృహం నుంచి సంప్రదాయ బద్ధంగా తీసుకొచ్చి ఆలయంలో అర్చకులకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో కాణిపాక ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్రెడ్డి, శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టుబోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్బాబు, శ్రీశైలం ఈవో లవన్న, కాణిపాక ఆలయ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వీరంతా వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఆర్అండ్బీ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీనివాసరాజు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు
శుక్రవారం రాత్రి శేష వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమానికి కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాంపల్లె, మిట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లె గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.