తుఫాను బాధితులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2023-12-06T00:55:35+05:30 IST
నగరి నియోజకవర్గ పరిధిలో మిచౌంగ్ తుఫానుతో నష్టపోయిన రైతులను, పల్లపు ప్రాంత ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ ఇన్చార్జి గాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
- నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన భానుప్రకాష్
నగరి, డిసెంబరు 5: నగరి నియోజకవర్గ పరిధిలో మిచౌంగ్ తుఫానుతో నష్టపోయిన రైతులను, పల్లపు ప్రాంత ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ ఇన్చార్జి గాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో భానుప్రకాష్ మంగళవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు. మండల పరిధిలోని వేలావడి ఎస్టీ కాలనీ వాసులు జల దిగ్బంధంలో ఇరుక్కోవడంతో వాగులో ప్రవహిస్తున్న నీటిలోనే ఆయన నడుచుకుంటూ వెళ్లి గిరిజనులను పరామర్శించారు. కాలనీలోని 75 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కష్టకాలంలో తమను ఆదుకున్న భానుప్రకా్షకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నగరి మండల అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి బాలాజీ, రాష్ట్ర టీడీపీ మహిళా అధికారప్రతినిధి మీరా, నగరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు చిట్టిబాబు, నాయకులు నారాయణస్వామి నాయుడు, సుబ్రమణ్యం, శ్రీనివాసులురెడ్డి, మధు, నాయకులు పాల్గొన్నారు.