రేపు జెండా ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-10-13T01:56:48+05:30 IST
దసరా పండగ అనగానే దక్షిణ భారత దేశంలోనే మైసూరు తర్వాత గూడూరులోనే ఘనంగా జరుగుతాయని ప్రతీతి. పైగా ఇక్కడ జరిగే జెండా ఉత్సవాలు మరీ ప్రత్యేకం. పైగా విజయదశమి ముందు వచ్చే అమావాస్య నాడు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి.. వైభవంగా నిర్వహిస్తారు. జెండా ఉత్సవాలకు పట్టణం జనసంద్రమవుతుంది.
గూడూరు, అక్టోబరు 12: గూడూరులో జెండా ఉత్సవాలు శనివారం రాత్రి జరగనున్నాయి. దీంతో గురువారం సాయంత్రానికే పట్టణం ముస్తాబైంది. ఎటుచూసినా విద్యుత్ కటౌట్లు, ఆర్చిలతో కళకళలాడుతోంది.
జెండా వెనుక కథ ఇదీ..
గ్రామం ఏర్పడిన తొలినాళ్లలో అరిష్టాలు ప్రబలి.. వ్యాధులు సోకుతున్నాయని ప్రజలు భీతిల్లేవారట. దాంతో ఆంజనేయస్వామిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని భావించారట. ఈ నేపథ్యంలో సుమారు 76 ఏళ్ల క్రితం పట్టణంలో తొలిసారిగా బొడ్డుచౌకలోని శక్తిరాయి వద్ద ఆంజనేయస్వామి జెండాను ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెబుతుంటారు. ఆరు గజాల తెల్లని గుడ్డపై సంజీవని పర్వతం తీసుకుని భూమిపై దిగుతున్న భంగిమలో ఆంజనేయస్వామి చిత్రాన్ని బొగ్గుతో రూపొందించి.. ఎనిమిది అడుగుల వెదురుకర్రకు దాన్ని అమర్చి.. విజయదశమికి ముందు వచ్చిన అమావాస్యనాడు సాయం సంధ్యవేళ కాగడాల వెలుగులో.. తప్పెట్ల హోరు నడుమ గ్రామోత్సవం జరిగిందట. దీనివల్ల పట్టణంలో వ్యాధులు తగ్గుముఖం పట్టడంతో ఏటా జెండా పండుగను నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
40కిపైగా ప్రాంతాల్లో..
పట్టణం విస్తరిస్తుండటంతో పలు ప్రాంతాల్లో ఆంజనేయస్వామి జెండాలను ప్రతిష్ఠించి పూజించడం మొదలైంది. దీంతో ప్రస్తుతం పట్టణం, సమీప ప్రాంతాలలో 40కిపైగా ప్రాంతాల్లో జెండా ఉత్సవాలు జరుపుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జెండాలు కూడా రంగులమయంగా మారాయి.
సందడిగా మారనున్న పట్టణం
జెండా ఉత్సవాలకు పట్టణవాసులు ఎక్కడున్నా గూడూరుకు వచ్చేస్తుంటారు. ఎంతలా అంటే ఉత్సవం రోజున పట్టణంలో ఎటుచూసినా జనమే కనిపిస్తారు. మరోవైపు ఊరేగింపు ముందు తెనాలి బ్యాండు, బేతాళ, తాజాగా కాంతార నృత్యాలు, జింగిరి మేళం, తప్పెట్లు, తాళాలు, కోలాటాలు, బొట్టబొమ్మల అభినయం, పార్వతీమహిషాసురుల యుద్ధనాట్యాలు, బాణసంచా పేలుళ్లు, యువకుల చిందుల మధ్య సందడిగా మారుతుంది. ప్రధానంగా గమళ్లపాళెం, తూర్పువీధి, కరణాలవీధి, మిట్టపాళెం, కోనేటిమిట్ట, అళఘనాథస్వామి దేవస్థానం, వీరారెడ్డిపల్లి, మహాలక్షమ్మ దేవాలయం, నరసింగరావుపేట, తిలక్నగర్సెంటర్, ఇందిరానగర్, అశోక్నగర్, అరుంధతీయనగర్ ప్రాంతా ల్లో మరింత వైభవంగా జెండా ఉత్సవాలు నిర్వహిస్తారు. జెండా ఉత్సవాలయ్యాక 15వ తేదీన కలశ స్థాపనతో శరన్నవరాత్రులను మొదలుపెడతారు.