అక్రమ మైనింగ్తోనే జనావాసాల్లోకి ఏనుగులు
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:10 AM
అడ్డుకుని చర్యలు తీసుకోండి కలెక్టర్కు చంద్రబాబు లేఖ
కుప్పం, డిసెంబరు 17: అటవీ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మైనింగ్వల్లే జనావాసాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయని ప్రతిపక్ష నేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. మైనింగ్ను ఆపడంతోపాటు ఏనుగులు అడవులు దాటి రాకుండా ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు కోవాలని కలెక్టరు షన్మోహన్ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం కలెక్టర్కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ. ‘కుప్పం మండలం నూలుకుంట గ్రామానికి చెందిన కర్రి సిద్ధప్ప పొలంనుంచి వస్తుండగా ఏనుగు దాడి చేయంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు ప్రభుత్వం సాయం, మెరుగైన వైద్యం అందించాలి. ఏనుగులు నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఏనుగుల బారిన పడకుండా సరైన రక్షణాత్మక చర్యలు అవసరం. కుప్పం అటవీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు పెరగడంవల్లనే అభయారణ్యంనుంచి ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలపై దాడులు చేసే సంఘటనలు ఈ నేపథ్యంలోనే జరుగుతున్నాయి. కుప్పం అటవీ ప్రాంతంలో మైనింగ్ను అరికట్టాల్సిన అవసరం ఉంది. కందకాలు తవ్వడం, అటవీప్రాంత సరిహద్దు గ్రామాలవద్ద ఫెన్సింగ్ వేయడం వంటి రక్షణ ఏర్పాట్లు చేయాలి. బాధిత ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.