Share News

శ్రీవారి ఆలయంలో 12న దీపావళి ఆస్థానం

ABN , First Publish Date - 2023-11-06T01:15:50+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది.

శ్రీవారి ఆలయంలో 12న దీపావళి ఆస్థానం

తిరుమల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది. దీపావళి పండగ రోజున ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో ఆస్థానం జరగనుంది. ఆస్థానంలో భాగంగా దేవేరులతో కలిసి మలయప్ప ఘంటా మండపంలో ఏర్పాటుచేసే సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతైన విష్వక్సేనులవారిని కూడా స్వామికి ఎడమ పక్కన మరో పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు చేస్తారు. తర్వాత స్వామికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దాంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఆస్థానం సందర్భంగా 12వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

Updated Date - 2023-11-06T01:15:53+05:30 IST