వైసీపీలో వర్గపోరు

ABN , First Publish Date - 2023-03-05T01:11:12+05:30 IST

సంఘమిత్ర విషయమై అధికారుల సమక్షంలో వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కత్తిపోట్లతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇలా శనివారం గంగవరం మండలం కీలపల్లెలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

 వైసీపీలో వర్గపోరు
గాయపడిన ఆనందస్వామి

సంఘమిత్ర కొనసాగింపుపై వివాదం

ఒకరికి కత్తిపోట్లు, పరిస్థితి విషమం

గంగవరం, మార్చి 4: సంఘమిత్ర విషయమై అధికారుల సమక్షంలో వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కత్తిపోట్లతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇలా శనివారం గంగవరం మండలం కీలపల్లెలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. కీలపల్లె పంచాయతీలోని వైసీపీ నాయకులు ఆనందస్వామి, సుబ్రమణ్యంరెడ్డి రెండువర్గాలుగా ఉన్నారు. సంఘమిత్ర ఈశ్వరమ్మ ఒకవర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆమెను తీసేయాలని గతేడాది అక్టోబరులో గ్రూపు సభ్యులు ఫిర్యాదు చేశారు. అధికారులు తొలగించకముందే ఈశ్వరమ్మ తప్పుకొన్నారు. పొన్నమూకులపల్లె సంఘమిత్రను ఇన్‌చార్జిగా నియమించారు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన మరో మహిళను నియమించినా, ఆమె కూడా స్వచ్ఛందంగా తప్పుకొన్నారు. మూడు నెలలుగా ఆ పంచాయతీలో రీ పెమెంట్‌లు అరకొర అవుతున్నాయని, సంఘమిత్రను నియమించాలని అధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియ నేపథ్యంలో శనివారం వెలుగు అధికారులు పంచాయతీ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న మహిళా గ్రూపు సభ్యుల భర్తలు వచ్చి కొత్త సంఘమిత్రగా ఎవరిని ప్రకటిస్తారని అడగ్గా.. సభ్యుల సమక్షంలో చెబుతామన్నారు. గతంలో తొలగించిన ఈశ్వరమ్మనే నియమిస్తారన్న వదంతుల నేపథ్యంలో మహిళా గ్రూపు సభ్యుల భర్తలు చొక్కాలు పట్టుకొని బాహాబాహీకి దిగారు. ఇంతలో ఆనందస్వామి, సుబ్రమణ్యంరెడ్డి వర్గాలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈశ్వరమ్మను చేర్చుకోకూడదని.. ఆమెనే తీసుకోవాలంటూ రెండు వర్గాలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో సుబ్రమణ్యం రెడ్డి వర్గానికి చెందిన మహబూబ్‌ బాషా, మరో నలుగురు ప్రత్యర్థి వర్గంపై పిడిగుద్దులు కురిపించారు. ఆనందస్వామిపైనా దాడిచేసి కత్తులతో పొడిచారు. వెంటనే ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి.. అనంతరం బెంగళూరుకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. కీలపల్లెలో మళ్లీ గొడవలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-03-05T01:11:12+05:30 IST