వేడుకగా పద్మావతీ పరిణయం
ABN , First Publish Date - 2023-04-30T02:41:15+05:30 IST
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో శనివారం పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి.
తిరుమల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో శనివారం పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మలయప్పస్వామి గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయ నాంచారులు పల్లకీపై నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి సాయంత్రం వేంచేశారు. స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగింది. తర్వాత స్వామికి కొలువు నిర్వహించారు.వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామి బంగారు తిరుచ్చిపై ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వేడుక ముగిసింది.పరిణయోత్సవాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వీరు శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా పరిణయ మండపాన్ని వివిధ రకాల ఫల, పుష్పాలతో అలంకరించడంతో పాటు చిన్నికృష్ణుడు, వెన్నకుండలు, ఏనుగులు, నెమళ్లు సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.