రిజిస్ట్రేషన్ల శాఖలో ‘కార్డు ప్రైమ్ 2.0’
ABN , First Publish Date - 2023-11-16T00:20:09+05:30 IST
రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ప్రైమ్ 2.0 నూతన విధానం మంగళవారం అమల్లోకి వచ్చింది. డాక్యుమెంట్ రైటర్లు, కక్షిదారులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమ్రాతం పట్టించుకోకుండా అమల్లోకి తీసుకొచ్చింది.
13 నుంచి అమల్లోకి వచ్చిన నూతన విధానం
ఈ రెండు రోజులూ చిత్తూరు ఆర్వోలో జరగని డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు
మిగతా చోట్ల 30 జరిగాయన్న అధికారులు
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 15: రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ప్రైమ్ 2.0 నూతన విధానం మంగళవారం అమల్లోకి వచ్చింది. డాక్యుమెంట్ రైటర్లు, కక్షిదారులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమ్రాతం పట్టించుకోకుండా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రక్రియలో తలెత్తిన ఇబ్బందులతో చిత్తూరు ఆర్వో పరిధిలో రెండు రోజులుగా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. మిగిలినచోట్ల 30 జరిగాయని అధికారులు చెప్పారు. సాధారణంగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు ఈకేవైసీ ఒక్కసారి చేస్తారు. కార్డుప్రైమ్ విధానంలో రెండుసార్లు చేయాలి. ఈకేవైసీ సర్వర్ సమస్య జిల్లావ్యాప్తంగా అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్రంగా ఉంది. ఇక, ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వీరి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తున్నారు. ఈ విధానంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు ఎక్కువ సమయం పడుతోంది. అమల్లోకి వచ్చిన మంగళ, బుధవారాల్లో చిత్తూరు రెవిన్యూ కార్యాలయంలో జనం రిజిస్ట్రేషన్లకోసం పడిగాపులు కాశారు. రిజిస్ట్రేషన్ శాఖ రూపొందించిన కార్డుప్రైమ్ సాఫ్ట్వేర్ను రిజిస్ట్రేషన్ వెబ్సైట్కు అనుసంధానం చేశారు. ఈ కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి. లేదా నెట్సెంటర్ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ కావాలి. అందులో ఏ రకమైన డీడ్ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫార్మేట్ను ఎంపిక చేసుకుని, ఆ వివరాలు నమోదు చేసి, దానిని సబ్రిజిస్ట్రార్కు లింక్ రూపంలో పంపించాలి. దానిని సబ్ రిజిస్ట్రార్ పరిశీలించిన తర్వాత అందులో ఏవైనా తప్పులను సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి సబ్రిజిస్ట్రార్ మెయిల్ ద్వారా లింక్ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్ ద్వారానే మరలా సబ్రిజిస్ట్రార్కు పంపితే, దానిని ఆయన ఓకే చేసినతర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి వేలిముద్ర వేయాల్సివుంటుంది. ఆ తర్వాత సబ్రిజిస్ట్రార్ డాక్యుమెంట్ను పీడీఎఫ్ రూపంలో దరఖాస్తుదారుడికి మెయిల్ పంపిస్తారు. ఇంత తతంగం నడుమ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండటంతో కక్షిదారులు వెనుకాడుతున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తాం
కార్డు ప్రైమ్ 2.0 విధానం మంగళవారం జిల్లాలో ప్రారంభమైంది. చిత్తూరులోని ఆర్వో కార్యాలయంలో రెండు రోజులుగా ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. మిగిలిన సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 30 జరిగాయి. ఈ కొత్త విధానంలో కొత్త, పాత పద్ధతిలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. మాన్యువల్గా, వెబ్సైట్ ద్వారా డాక్యుమెంట్లు సమర్పించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇందులో వున్న సాంకేతిక సమస్యలను రిజిస్ట్రేషన్ శాఖ సరిచేస్తున్నది. త్వరలో కార్డు ప్రైమ్ 2.0పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
- శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, చిత్తూరు.