బాలుడి హత్య
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:36 PM
తమిళనాడులో కిడ్నాప్ అయిన బాలుడు బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం మండలాల సరిహద్దులో శవమై తేలాడు.
పిల్లల కిడ్నాప్ ముఠా హస్తం!
వరదయ్యపాళెం, డిసెంబరు 18:తమిళనాడులో కిడ్నాప్ అయిన బాలుడు బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం మండలాల సరిహద్దులో శవమై తేలాడు. బుచ్చినాయుడు కండ్రిగ పోలీసుల కథనం మేరకు... తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి తాలుకా పల్లెవాడ గ్రామానికి చెందిన సురేష్, సింధు దంపతుల రెండవ కుమారుడు హనిశ్(8).శనివారం రాత్రి క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొనేందుకు హనిశ్ తల్లిదండ్రులు మానెల్లూరు గ్రామానికి వెళ్లారు. అక్క బృందతో పాటు ఇంట్లో వున్న హనిశ్ కాసేపటికి బయటకు వచ్చాడు. వరుసకు అత్త అయిన రేఖ ఆ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళుతానని స్కూటీలో ఎక్కించుకుంది. వరదయ్యపాళెం మండలంలోని తన సొంత గ్రామమైన కాంబాకం హరిజనవాడకు తీసుకెళ్లే క్రమంలో తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన నాయుడుకుప్పం వద్ద చెక్పోస్టు ఆటోను ఢీకొనడంతో హనిశ్ తలకు గాయమైంది. ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తీసుకెళతానన్నా వినకుండా కాంబాకం హరిజనవాడకు హనిశ్ను తీసుకెళ్లింది.శనివారం రాత్రి 11గంటలకు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు హనిశ్ కన్పించకపోవడం గుర్తించి మాదరపాకం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీసిటీలో పనిచేసే పల్లెవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు రేఖ ఓ బాలుడిని తీసుకెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టడంతో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేఖ అకౌంటుకు రూ.25లక్షలు చేరినట్లు సెల్ఫోన్లో వచ్చిన మెసేజిని పోలీసులు గుర్తించారు.రేఖను ఆదివారం మాదరపాకం పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పిల్లల కిడ్నాప్ ముఠాయే ఆమె బ్యాంకు అకౌంటుకు డబ్బు పంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.విచారణలో బుచ్చినాయుడుకండ్రిగ సరిహద్దు గ్రామం వెస్ట్వరత్తూరు సమీపంలోని తడ-శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో హనిశ్ మృతదేహాన్ని పడేసినట్లు తెలిసింది.దీంతో అక్కడికెళ్లిన పోలీసులు హనిశ్ మృతదేహాన్ని తమిళనాడుకు తీసుకెళ్లారు.