బావిలో భవ్యశ్రీ తల వెంట్రుకలు లభ్యం

ABN , First Publish Date - 2023-09-26T01:49:18+05:30 IST

పెనుమూరు మండలం ఠాణావేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ మృతదేహం లభ్యమైన బావిలో నీటిని సోమవారం పోలీసులు తోడించారు.

బావిలో భవ్యశ్రీ తల వెంట్రుకలు లభ్యం
బావిలో నుంచి భవ్యశ్రీ తల వెంట్రుకలను బయటకు తీసిన పోలీసులు

పెనుమూరు, సెప్టెంబరు 25: పెనుమూరు మండలం ఠాణావేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ మృతదేహం లభ్యమైన బావిలో నీటిని సోమవారం పోలీసులు తోడించారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తమ సిబ్బందితో పాడు పడిన ఆ బావిలోని నీటిని మోటార్ల సాయంతో మొత్తం బయటకు తీశారు. అనంతరం బావిలో భవ్యశ్రీ తల వెంట్రుకలు జడతోపాటు రబ్బరు బ్యాండుతో లభ్యమైంది. ఆ వెంట్రుకలను ల్యాబ్‌కు పంపించారు. డీఎన్‌ఏ పరీక్ష చేసి ఆ వెంట్రుకలు భవ్యశ్రీవా కాదా అనేది నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం నీళ్లలోనే ఉండటంతో జట్టు ఊడిపోయిందని డాక్టర్లు చెప్పినట్లుగా పోలీసులు తెలపగా.. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డను కొందరు యువకులు గుండు కొట్టి, చంపి బావిలో పడేవారని అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ క్రమంలో బావిలో నీటిని తోడినట్లు పోలీసులు చెప్పారు. వెంట్రుకలు కుదుళ్లతో పాటు ఉండటంతో అవే ఊడిపోయాయని వారు పేర్కొన్నారు. కాగా, భవ్యశ్రీ తల్లిదండ్రులు ముగ్గురు యువకులపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ అదుపులోకి తీసుకున్నారు. వారి కాల్‌డేటా, కదలికలపై ఆరా తీస్తున్నారు.

మా అమ్మాయిది ముమ్మాటికి హత్యే

‘మా అమ్మాయి భవ్య మృతదేహం లభించిన బావిలో పోలీసులు నీటిని వెలికి తీయడంతో తలవెంట్రుకలు బయటపడ్డాయని అంటున్నారు. ఆ వెంట్రుకలు ఎలా ఊడాయి. గుండు కొట్టి బావిలోనే పడేశారని మాకు గట్టి నమ్మకం ఉంది. వెంట్రుకలు బావిలో దొరికితే చర్మంతో పాటు ఉండాలి కదా? ఎందుకు లేవు? మేము ఒత్తిడి తెస్తే పోలీసులు బావిలో నీళ్లు తీశారు. మా కుమార్తెకు గుండు కొట్టి, చిత్రహింసలు పెట్టి చంపేసి బావిలో పడేశారు. మా కుమార్తె ఆత్మహత్య చేసుకేనేంత పిరికిది కాదు’ అని పద్మావతి, మునికృష్ణ సోమవారం రాత్రి వారు స్పష్టంచేశారు. తమ కుమార్తెకు ఈత వచ్చని, తానే నేర్పానని పద్మావతి చెప్పారు.

Updated Date - 2023-09-26T01:49:18+05:30 IST