కుప్పం ఓటరు జాబితాలో అవకతవకలెన్నో?
ABN , First Publish Date - 2023-11-06T01:25:12+05:30 IST
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు బయట పడుతున్నాయి.
కుప్పం, నవంబరు 5: ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు బయట పడుతున్నాయి. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 2,17,771 ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 1,09,27, మహిళలు 1,08,625 మంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 243 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల వారీగా ఆదివారం టీడీపీ నేతలు ఓటర్ల జాబితాలను పరిశీలించారు. ఇందులో సుమారు 500-600 మేరకు డబుల్ ఎంట్రీలు గుర్తించారు. ఒకే వ్యక్తిని వేర్వేరు ఫొటోలతో వేర్వేరు ఓటరు నెంబర్లతో రెండు చోట్ల ఓటర్లుగా చేర్చారు. ఇ, చనిపోయి వారి పేర్లనూ జాబితానుంచి డిలీట్ చేయలేదు. ఇలా డెత్ కేసులు 5 వేలనుంచి ఆరువేల దాకా ఉన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఈ తీరుతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఓట్లను తొలగించాలని గతంలో తామిచ్చిన వినతులను అధికారులు పట్టించుకోలేదంటూ వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జాబితాలో తప్పులెన్నో?
రామకుప్పం, నవంబరు 5: ఓటర్ల ముసాయిదా జాబితాలో లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి. ఆదివారం టీడీపీ నేతలు చేపట్టిన పరిశీలనలో ఇవి వెలుగు చూశాయి. రామకుప్పం మండలంలో వెయ్యికిపైగా చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. 100మందికి పైగా రెండేసి ఓట్లు.. 150మందికి పైగా శాశ్వతంగా గ్రామాలను వదిలి వెళ్ళిన వారి పేర్లూ జాబితాలో నమోదై ఉన్నాయి. నెల రోజుల కిందట నిర్వహించిన ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కార్యక్రమంలో ఈ ఓట్లపై విపక్షం వినతులిచ్చినా వాటిని తొలగించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఆదివారం టీడీపీ నేతలు, శ్రేణులు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితా పరిశీలనలో పాల్గొన్నారు. గతంలో ఈ ఓట్ల తొలగింపుపై తామిచ్చిన వినతులను అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా చనిపోయిన వారు, అనర్హుల ఓట్లను తొలగించాలని వారు కోరారు.