కడుపునొప్పితో యువకుడి మృతి
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:44 AM
కడుపునొప్పి తాళలేక ఓ యువకుడు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రెండు గంటలు ఆలస్యంగా 108 రావడంతోనే ఇలా జరిగిందంటూ స్థానికుల ఆగ్రహం
పూతలపట్టు, డిసెంబరు 13: కడుపునొప్పి తాళలేక ఓ యువకుడు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎర్రచెరువుపల్లి పంచాయతీ ఎస్టీకాలనీకి చెందిన భాస్కర్ (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇతడికి ఉన్నఫలాన కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి రావడంతో సుమారు రాత్రి 10 గంటల సమయంలో కడుపు నొప్పి తీవ్రం కావడంతో స్థానికులు 108 వాహనానికి సమాచారమిచ్చారు. ఆ వాహనం రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 12.15 గంటలకు ఎస్టీకాలనీకి వచ్చి అతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ భాస్కర్ మృతి చెందాడు. 108 వాహనం సకాలంలో రాకపోవడంతోనే భాస్కర్ చనిపోయాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నాయకులు ఎస్టీకాలనీకి వెళ్లి తమ సొంత ఖర్చులతో దహనసంస్కారాలు చేయించారు.