హామీ మరిచారా?!

ABN , First Publish Date - 2023-03-31T03:52:35+05:30 IST

‘అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పిస్తా’’ అని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతగా ప్రస్తుత సీఎం జగన్‌ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లకు హామీ ఇచ్చారు.

హామీ మరిచారా?!

ముఖ్యమంత్రి జగన్‌కు ‘జూనియర్‌’ గెస్ట్‌ లెక్చరర్ల ప్రశ్న

తొమ్మిదేళ్లుగా రూ.10 వేల వేతనం

అది కూడా ఏటా 8 నెలలకే పరిమితం

పాదయాత్రలో వైసీపీ అధినేతకు సమస్య వివరించిన గెస్ట్‌ లెక్చరర్లు

అధికారంలోకి రాగానే ‘న్యాయం’ హామీ

నాలుగేళ్లయినా పట్టించుకోని వైనం

ఇప్పటికైనా న్యాయం చేయాలని వెయ్యిమందికి పైగా లెక్చరర్ల వినతి

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పిస్తా’’ అని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతగా ప్రస్తుత సీఎం జగన్‌ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లకు హామీ ఇచ్చారు. అయితే.. ఈ హామీని అధికారం చేపట్టాక జగన్‌ మర్చిపోయారని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయినా తమ గురించి కనీస ఆలోచన కూడా చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్యోగంలో చేరిన తొమ్మిదేళ్ల నుంచీ కేవలం రూ.10 వేల జీతమే తీసుకుంటూ కుటుంబాలను పోషించలేని దుస్థితికి చేరుకున్నామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడటం తప్ప వేరే దారి లేదని రాష్ట్రవ్యాప్తంగా 1,074 మంది గెస్ట్‌ జూనియర్‌ లెక్చరర్లు లబోదిబోమంటున్నారు. జూనియర్‌ కాలేజీల్లో ఐదు రకాల లెక్చరర్‌ వ్యవస్థలున్నాయి. రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఎంటీఎస్‌, పార్ట్‌ టైమ్‌, గెస్ట్‌ జూనియర్‌ లెక్చరర్లు విద్యార్థులకు బోధిస్తున్నారు. వీరిలో గెస్ట్‌ జూనియర్‌ లెక్చరర్లను 2013-14లో నియమించారు. అన్ని కాలేజీల్లోనూ వీరు బోధిస్తున్నారు. అప్పట్లో రూ.10 వేల వేతనం ప్రాతిపదికన ఉద్యోగంలో చేరారు. తమ జీతాలు పెంచాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ను పాదయాత్రలో కర్నూలు, కడప జిల్లాల్లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా పలుమార్లు ఇంటర్మీడియెట్‌ అధికారులను గెస్ట్‌ లెక్చరర్లు కలిసి వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అయినా, ఇప్పటి వరకు వారి గోడును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. రెగ్యులర్‌తో పాటు మిగిలిన అన్ని కేటగిరీల్లోని లెక్చరర్లకు జీతాలు పెంచిన ప్రభుత్వం గెస్ట్‌ లెక్చరర్లను మాత్రం విస్మరించింది. కాంట్రాక్టు లెక్చరర్లకు 2013లో జీతం రూ.18 వేలు ఉంటే, ఇది ఇప్పుడు రూ.57,100కు చేరింది. పార్ట్‌టైమ్‌ లెక్చరర్ల వేతనం 2015లో రూ.10 వేలు ఉంటే ఇప్పుడు రూ.37 వేలకు చేరింది. ఎంటీఎస్‌ లెక్చరర్లకు కనీసం రూ.33 వేలకు పైగా వేతనాలు అందుతాయి. కానీ, గెస్ట్‌ లెక్చరర్లకు మాత్రం చేరినప్పుడు ఇచ్చిన రూ.10 వేలే ఇప్పటికీ ఇస్తున్నారు. పోనీ తక్కువ జీతం అనే కారణంతో పనిలో ఏవైనా మినహాయింపులు ఇస్తున్నారా? అంటే అదీ లేదు. రెగ్యులర్‌ లెక్చరర్లతో పాటే వీరు కూడా విధులు నిర్వహిస్తున్నారు. అందరితోపాటే గతంలో బయోమెట్రిక్‌, ఇప్పుడు ముఖ ఆధారిత హాజరు వేస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లోనూ సమానంగా చూస్తూ, వేతనం విషయంలో మాత్రం ఇంత వివక్ష ఎందుకని గెస్ట్‌ లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు.

పదేళ్ల తర్వాత వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు

గత పదేళ్లకు ముందు వివిధ కారణాలతో ఉద్యోగాలకు దూరమైన కాంట్రాక్టు లెక్చరర్లను ఇప్పుడు విధుల్లోకి తీసుకోవాలంటూ ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో వారికి కౌన్సెలింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. అనారోగ్యం, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో అప్పట్లో వారు ఉద్యోగాలు వదిలేశారు. అప్పట్లో జీతం తక్కువగా ఉండటం కూడా ఓ కారణం. ఇప్పుడు జీతాలు భారీగా పెంచడంతో తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరడంతో, వారిని ఇప్పుడు విధుల్లోకి తీసుకుంటున్నారు.

8 నెలల వేతనంతో ఏడాది పని!

గెస్ట్‌ లెక్చరర్లకు ఇస్తున్న రూ.10 వేల వేతనం కూడా ఏడాదిలో 12 నెలలు ఇవ్వడంలేదు. కేవలం 8 నెలలకు మాత్రమే రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నారు. మిగిలిన 4 నెలలు ఎలాంటి ఆధారం లేకుండానే వారు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలావుంటే, కరోనా నేపథ్యంలో నిధులులేవనే సాకుతో 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన వేతనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అప్పటినుంచీ అధికారుల చుట్టూ లెక్చరర్లు తిరుగుతున్నా అప్పటి బకాయిలు ఇప్పటికీ ఇవ్వలేదు.

Updated Date - 2023-03-31T03:52:35+05:30 IST