యువగళం ముగింపుసభ చారిత్రాత్మకం
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:23 AM
: నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుసభ సమకాలీన రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
అనంతపురం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుసభ సమకాలీన రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. దశాబ్దపు అతిపెద్ద రాజకీయ సభగా యువగళం నవశకానికి నాంది పలికిందని అన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా హాజరై యువతనేత లోకేశబాబును నిండు మనుసుతో ఆశీర్వదించారని పేర్కొన్నారు. యువగళం-నవశకం పేరిట జరిగిన వేడుకకు పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవనకళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశను ఒకే వేదికపై చూసిన తర్వాత వైసీపీలో ఓటమి భయం మొదలైందని అన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు కాదని, నవశకం ప్రారంభాన్ని సూచిస్తోందని అన్నారు. సీఎం జగనరెడ్డి తాడేపల్లి రాజభవనం తలుపులు బద్దలుకొట్టే వరకూ యుద్ధం సాగుతుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా టీడీపీ, జనసేన పొత్తు చారిత్రాత్మకమని అన్నారు. ప్రస్తుతం ఏపీకి ఇది చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాలకోసం టీడీపీ, జనసేన పొత్తు అనివార్యమని అన్నారు. ఈ పొత్తు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నదని అ న్నారు. రెండు పార్టీల పొత్తుతో వైసీపీకి ఓటమి ఖాయమైందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు కనీసం 160 స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-జనసేన అభ్యర్థులను ఎన్నుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగనరెడ్డి అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ముందుకు వస్తే, వైసీపీ అరాచక ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ అయితే... జగనరెడ్డి ప్రిజనరీ అని ఎద్దేవా చేశారు. రానున్న సాధారణ ఎన్నికలు జగనరెడ్డి అహంకారానికి, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధమని అన్నారు. జగనరెడ్డి విద్య, వైద్యం, రహదారులతో సహా అన్ని రంగాలను నాశనం చేసి, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబునాయుడు చెప్పినట్లు టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను త్వరలో రూపొందిస్తామని అన్నారు. త్వరలో పవనకళ్యాణ్, ఇతర టీడీపీ నేతల సమక్షంలో అమరావతి, తిరుపతిలో జరిగే సభల్లో ఏదో ఒకదానిలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని తెలిపారు. ఓటమిని ముందే ఊహించిన జగనరెడ్డి ఎమ్మెల్యేలను బదిలీ చేసే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు.