వైసీపీది నమ్మక ద్రోహ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-03-09T02:53:05+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సబ్ కమిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మభ్యపెడుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే సబ్ కమిటీ
సమ్మిట్లో ఆస్థాన కంపెనీలతోనే ఒప్పందాలు
జగన్ను చూసి వచ్చేది శోభరాజ్, దావూద్ వంటి వాళ్లే
డీజిల్ దందాపై కేంద్రానికి ఫిర్యాదు: సత్యకుమార్
అనంతపురం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సబ్ కమిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మభ్యపెడుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలను మోసం చేస్తోంది. వైసీపీది నమ్మక ద్రోహ ప్రభుత్వం’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. అనంతపురంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ చెప్పే మాటలను నమ్మేంత అమాయకులు ఎవరూ లేరు. సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు. ఏ సమస్య లేవనెత్తినా ఎన్నికలకు ముడిపెడుతూ ప్రభుత్వం పబ్బం గడుపుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రూ.లక్షల కోట్లు పెట్టుబడి రాష్ర్టానికి తెచ్చామంటూ గొప్పలు పోవడం తప్ప... సాధించింది ఏదీలేదు. జీ-20 నిధులు రూ.100 కోట్లను వాడుకున్నారు. ప్రధాని మోదీ బ్రాండ్ లేకుండా రాష్ర్టానికి నిధులు ఎలా వస్తాయని జగన్ అనుకుంటున్నారు? గతంలో దావో్సలో చేసుకున్న ఒప్పందాలనే విశాఖ సమ్మిట్లో చూపించారు. ఆరు నెలల క్రితం జీవోలు రిలీజ్ చేసి.. తాజాగా ఒప్పందం ఎలా చేసుకుంటారు? ముందు జీవోలు ఇచ్చి ఒప్పందం చేసుకోవడం ప్రపంచంలో ఎక్కడా లేదు. సమ్మిట్లో ఉత్తుత్తి ఎంఓయూలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం తన ఆస్థాన కంపెనీలతోనే ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో సమ్మిట్ పేరుతో స్టంట్లు చేస్తూ మరో మోసానికి వైఎస్ జగన్ తెరతీశారు. జగన్ తన ఆస్థాన కంపెనీలకు మాత్రమే రాయితీలు ఇస్తున్నారు. అంబానీ, అదానీ, జీఎంఆర్ బలవంతంగా ఆ సమ్మిట్కు వచ్చి అంక్షితలు వేసి వెళ్లారు. సీఎం జగన్ ట్రాక్ రికార్డు చూసి పెట్టుబడిదారులు రాష్ర్టానికి ఎలా వస్తారు? జగన్ను చూసి వచ్చినా...చార్లెస్శోభరాజ్, దావూద్ ఇబ్రహీం తరహావాళ్లే వస్తారు. ఆర్టీసీ కడప రీజనల్ చైర్మన్ కనుసన్నల్లో సాగిన డీజిల్ దందా వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’’ అని సత్యకుమార్ తెలిపారు