పుంగనూరులో వైసీపీ గూండాగిరి
ABN , First Publish Date - 2023-08-05T00:51:45+05:30 IST
పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడికి పాల్పడిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనకు దిగారు.
జిల్లాలో భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
అనంతపురం అర్బన, ఆగస్టు 4: పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడికి పాల్పడిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనకు దిగారు. అనంతపురం నగరంలోని జడ్పీ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ అర్బన నాయకులు సీఎం జగన చిత్రపటాలను దహనం చేశారు. సీఎం జగన డౌన డౌన అ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కళ్యాణదుర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో గుత్తిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పవనకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేట వద్ద టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి వైసీపీ అల్లరి మూకల చేత రాళ్లదాడికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిసిన చంద్రబాబునాయుడుకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ గూండాలను నిలువరించాల్సిన పోలీసులే వారికి వత్తాసు పలకడం దుర్మార్గమని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వత్తాసు పలికే పోలీసులపై టీడీపీ అధికారంలోకి రాగానే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడి ఘటనను ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఖండించాలని కోరారు.
పెద్దిరెడ్డీ.. నీకు రోజులు దగ్గరపడ్డాయ్
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు
అనంతపురం అర్బన, ఆగస్టు 4: ‘ఖబడ్డార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..!నీ రోజులు గగ్గరపడ్డాయ్..! నీ పరిపాలన అంతానికి వచ్చింది’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. అనంతపురం నగరంలోని తన స్వగృహంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నీ దుర్మార్గాలు, దాష్టీకాలు ఎక్కువ రోజులు సాగవు. నీ గూండాయిజానికి రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నీ జాగిరా అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో పుట్టిన నేత, 40 సంవత్సరాలుగా జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలకంగా పనిచేస్తున్న మాజీ సీఎం నారా చంద్రబాబుపైనే రాళ్ల దాడి చేయడం వైసీపీ గూండాయిజానికి పరాకాష్ట అని అన్నారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన నేతపైనే దాడులకు తెగిస్తుంటే వైసీపీ గూండాలను ఏమనాలని మండిపడ్డారు. రాళ్ల దాడులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార వైసీపీ శాంతిభద్రతలను భంగం కలిగిస్తున్నా పోలీసు వ్యవస్థ చోద్యం చూడటం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనతో సీఎం జగన సిగ్గుపడాలని అన్నారు. వైసీపీ గూండాయిజానికి టీడీపీ శ్రేణులు భయపడతాయనే భ్రమలు వీడాలని అన్నారు. ఇప్పటికైనా జగన బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనను, ఆయన పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
పెద్దిరెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలి
మాజీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం అర్బన, ఆగస్టు 4: చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటనలో రాళ్లదాడి ఘటనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు కాన్వాయ్, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు రాళ్ల దాడికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, తన సొంత జిల్లాలో పర్యటిస్తే ఇలాంటి దాడులకు పాల్పడ తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్తూరులో పర్యటిస్తే అంత భయమెందుకని ప్రశ్నించారు. వైసీపీ అల్లరిమూకల దాడులకు టీడీపీ శ్రేణులు భయపడవని అన్నారు. మరోసారి ఇలా జరిగితే, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.