కొత్త ఈవీఎంలతో మాక్ పోలింగ్ : కలెక్టరు
ABN , First Publish Date - 2023-11-10T00:23:29+05:30 IST
కొత్త ఈవీఎంలతో మాక్ పోలింగ్ పక్కాగా నిర్వహిస్తామని కలెక్టరు గౌతమి తెలిపారు.
అనంతపురం టౌన, నవంబరు 9: కొత్త ఈవీఎంలతో మాక్ పోలింగ్ పక్కాగా నిర్వహిస్తామని కలెక్టరు గౌతమి తెలిపారు. స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎంల చెకింగ్ పక్రియ గురువారంతో ముగిసింది. పలు విషయాలను కలెక్టరు అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ.. జిల్లాకు కొత్తగా 6,981 బ్యాలెట్ యూనిట్లు, 5,450 కంట్రోల్ యూనిట్లు, 6,557 వీవీప్యాట్స్ ఈవీఎంలు వచ్చాయన్నారు. వాటి పనితీరును 20 రోజులుగా చెక్ చేశామని, ఈ కార్యక్రమం గురువారంతో ముగిసిందని తెలిపారు. ఈ చెకింగ్లో 76 బ్యాలెట్ యూనిట్లు, 193 వీవీప్యాట్స్, 44 కంట్రోల్ యూనిట్స్ రిజెక్ట్ అయ్యాయన్నారు. ఈ వివరాలను ఎన్నికల కమిషనకు తెలియజేస్తామన్నారు. మిగిలిన కొత్త ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని, ఓట్లు సరిగా నమోదవుతున్నాయా లేదా అని పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, ఈవీఎంల చెకింగ్ పర్యవేక్షణాధికారి రవీంద్ర, డీపీఓ ప్రభాకరరావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ కనకరాజు పాల్గొన్నారు.