సమస్యలను పరిష్కరిస్తారా..?

ABN , First Publish Date - 2023-05-16T01:27:19+05:30 IST

జిల్లా సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ గౌతమి ఈ సమావేశాన్ని ఈసారి సూపర్‌ స్పెషాలిటీలో ఏర్పాటు చేశారు.

సమస్యలను పరిష్కరిస్తారా..?
ఏఎంసీలో ఉక్కపోతకు తట్టుకోలేక ఇంటినుంచి తెచ్చుకున్న ఫ్యానతో ఉపశమనం పొందుతున్న రోగి ( ఫైల్‌)

నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

కొత్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో తొలిసారి..

అనంతపురం టౌన, మే 15: జిల్లా సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ గౌతమి ఈ సమావేశాన్ని ఈసారి సూపర్‌ స్పెషాలిటీలో ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశం జరగాలి. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలకు ఆమోదం తెలపాలి. కానీ ఈసారి ఆలస్యంగా సమావేశం జరుగుతోంది. గత కలెక్టర్‌ నాగలక్ష్మి ఉన్నప్పుడు కమిటీ మీటింగ్‌ జరగాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత కలెక్టర్‌ బదిలీ జరగడంతో సమావేశం ఆగిపోయింది. తాజాగా కొత్త కలెక్టర్‌ గౌతమి జిల్లాకు వచ్చారు. ఆమె ఆధ్వర్యంలో తొలిసారిగా సమావేశం జరుగుతోంది. ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏసీలు, సీసీ కెమెరాలు పనిచేయవు, ఫ్యానలు తిరగవు. రోగులను తరలించేందుకు వీల్‌చైర్‌, సె్ట్రచర్స్‌ లేవు. ఇరుకుగా ఉన్న ఓపీ కేంద్రాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ల్యాబ్‌లలో యంత్రాలు, పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదు. రక్తపరీక్షలు మ్యానువల్‌గా చేస్తున్నారు. సీనియర్‌ వైద్యులు సమయ పాలన పాటించడం లేదు. ఏఎంసీ, క్యాజువాలిటీలో అవసరం మేరకు పడకలు లేవు. దీంతో కొందరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. గత సమావేశాల్లో వీటిపై చర్చ జరిగినా, తగిన చర్యలు తీసుకోలేదు. కొత్త కలెక్టర్‌ అయినా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారా అన్న చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-05-16T01:27:19+05:30 IST