అప్పర్భద్ర అక్రమ నిర్మాణంపై పోరాటమే
ABN , First Publish Date - 2023-06-03T00:56:58+05:30 IST
కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై పోరాడుతామని, ఏపీ రైతు ప్రయోజనాల దృష్ట్యా వెనక్కు తగ్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం విద్య, జూన 2: కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై పోరాడుతామని, ఏపీ రైతు ప్రయోజనాల దృష్ట్యా వెనక్కు తగ్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన తనకు తాను పేదలకు ప్రతినిధినని, పెత్తందార్లతో పోరాడుతున్నానంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోని 29 మంది సీఎంలలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన అని తెలిపారు. ఆయన ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ వివరాలే స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు దినపత్రిక, టీవీ మీడియా సంస్థ లేదంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడనీ, జగన మీడియా సంస్థలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. సీఎం క్లాస్ వార్ కాకుండా క్యాస్ట్ వార్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఒకవైపు కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ... మరోవైపు ఇతర కులాల వారిని రెచ్చగొడుతూ కులపోరాటం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులాన్ని దృష్టిలో ఉంచుకునే అమరావతి రాజధానిని దౌర్భాగ్యస్థితికి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయన్నారు. ఇదే జరిగితే, రాషా్ట్రనికి జగన పీడ ముందుగానే విరుగడవుతుందని అన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, నాయకులు నారాయణస్వామి, మల్లికార్జున, శ్రీరాములు పాల్గొన్నారు.