పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దు
ABN , First Publish Date - 2023-10-30T23:34:17+05:30 IST
పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమ వారం మండలంలోని నూతిమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్డీటీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే కార్యక్రమం నిర్వహించారు.
కంబదూరు (కళ్యాణదుర్గం), అక్టోబరు 30: పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమ వారం మండలంలోని నూతిమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్డీటీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంబదూరు ఐసీడీఎస్ సీడీపీవో వనజ అక్కమ్మ హాజరై మాట్లాడారు. చిన్న వయసులో బాల్యవివాహాలు చేయడం వలన ఆడపిల్లలు మానసికంగా, శారీరకంగా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, ప్రసవ సమయంలో తల్లిబిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆడపిల్లకు 18 యేళ్లు, మగ పిల్లలకు 21 యేళ్లు నిండిన తరువాతే వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమమని తెలిపారు. అలా కాకుండా బాల్య వివాహాలు చేయాలని చూస్తే శిక్షార్హులవుతారన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100, 112లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. బాల్యవివాహాలు లేని మండలంగా కంబదూరు మండలాన్ని తీర్చిదిద్దడమే మనందరి లక్ష్యం కావాలని ఆర్డీటీ సెక్టార్ టీం లీడర్ ఆది నారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, ఎంఎల్హెచ్పీ యర్రిస్వామినాయక్, వీఆర్వో రామాంజినేయులు, సచివాలయసిబ్బంది శ్రీలత, ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగరాజు, శివకుమార్, బ్రహ్మానంద, కవిత, మహేష్, తిప్పేస్వామి, రంగనాథ్, సుజాత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.