అధికార పార్టీ ఇసుక దందా
ABN , First Publish Date - 2023-07-21T01:03:43+05:30 IST
మండల పరిధిలోని రచ్చుమర్రి సమీపంలో వేదవతి హగరి నది నుంచి అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారీగా ఇసుకను దోచే ప్రయత్నం చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వి నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు.
వేదవతిలో చొరబడ్డ మాజీ ఎమ్మెల్యే
భారీగా నిల్వలను సీజ్ చేసిన అధికారులు
కణేకల్లు, జూలై 20: మండల పరిధిలోని రచ్చుమర్రి సమీపంలో వేదవతి హగరి నది నుంచి అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారీగా ఇసుకను దోచే ప్రయత్నం చేశారు. ఇసుకను అక్రమంగా తవ్వి నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇసుక తవ్వకాలకు అనుమతి ఉందని స్థానికులను నమ్మించి.. 20 రోజులపాటు ఇసుకను తోడి సమీపంలో నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న మైన్స అండ్ జియాలజీ అధికారులు రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి ఇసుక గుట్టలను చూసి అవాక్కయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో 12,786 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను, ఒక ఎక్స్కవేటర్ను (హిటాచీ) సీజ్ చేశారు. గ్రామస్థులను విచారించి, ఇసుక తవ్వకాల వెనుక కణేకల్లు మండలంలోని హనకనహాళ్కు చెందిన శ్రీకాంతరెడ్డి, గురునాథ్రెడ్డి, కేశవరెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై కలెక్టర్కు పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని మైన్స అండ్ జియాలజీ అధికారులు గురువారం తెలిపారు. రెండు రోజులపాటు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచిన అధికారులు, గురువారం ఫొటోలను మీడియాకు విడుదల చేయడం గమనార్హం. ఇసుక దందా వెనుక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. రచ్చుమర్రి వద్ద అధికారిక రీచ లేకపోయినా నెలల తరబడి ఇసుకను తవ్వుతున్నారని, టిప్పర్లు, లారీల్లో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మేమే వెలుగులోకి తెచ్చాం: కాలవ
భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుయాత్రలో భాగంగా గత నెల 29న తెలుగుదేశం నాయకులు రచ్చుమర్రి అక్రమ ఇసుక వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిందని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అదే రోజు మైన్స, విజిలెన్స అధికారులు తనిఖీ చేసుంటే పెద్ద ఇసుక డంప్ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఒత్తిడి మేరకు అప్పట్లో అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అక్రమ ఇసుక నిల్వలను తాము బయటపెట్టిన తరువాత ఇసుకాసురులు రాత్రింబవళ్లు టిప్పర్లలో కర్ణాటకకు తరలించారని ఆరోపించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాపు రామచంద్రారెడ్డి ఎన్నిరకాల అక్రమాలకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న ఇసుక దందాపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.