దాయాదులే చంపేశారు
ABN , First Publish Date - 2023-02-21T00:19:13+05:30 IST
పట్టణంలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో తొమ్మిది మంది నిందితులను టూటౌన పోలీసులు అరెస్టు చేశారు.
- కోటిరెడ్డి, డ్రైవర్ హత్య కేసులో 9 మంది అరెస్టు
- తండ్రి మరణాన్ని సెలబ్రేట్ చేయడంతో కొడుకు పగ
- రెక్కీ నిర్వహించి.. ఇంట్లోకి వెళ్లి కత్తితో దాడి
-వివరాలు వెల్లడించిన డీఎస్పీ నరసింగప్ప
గుంతకల్లు, ఫిబ్రవరి 20: పట్టణంలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో తొమ్మిది మంది నిందితులను టూటౌన పోలీసులు అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారని టూటౌనలో డీఎస్పీ నరసింగప్ప సోమవారం తెలిపారు. హత్య కేసు ప్రధాన నిందితుడు పాటిల్ భరత సింహారెడ్డి, అతడి తల్లి పాటిల్ సుగణ అలియాస్ నిర్మల, డి సుబ్బరాయుడు, ఇ ప్రకాశగౌడు, దేవేంద్ర రెడ్డి, డి మాలతి, డి అబ్దుల్లా, గోవిందప్ప, దేవేంద్రప్ప, సి గోవర్ధన రెడ్డిని అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. హతుడు జీపీ హేమ కోటిరెడ్డికి, అతడి దాయాది సుధాకర్ రెడ్డికి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, దీనిపై కోటిరెడ్డి, అతడి సోదరులకు, సుధాకర్ రెడ్డికి మధ్య కోర్టులో కేసు ఉందని డీఎస్పీ తెలిపారు. కేసు నడుస్తున్న సమయంలోనే కోటిరెడ్డి ఇద్దరు సోదరులు చనిపోయారని, ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న కోటిరెడ్డిని అడ్డు తొలగించుకోవడానికి సుధాకర్ రెడ్డి పథకం రచించాడని తెలిపారు. కోటిరెడ్డిని చంపించడానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడని, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు. గత నెలలో సుధాకర్ రెడ్డి వయోభారంతో మృతిచెందాడని తెలిపారు. దీంతో జీపీ కోటిరెడ్డి, అతడి సంబంధీకులు సంతోషంతో ఇంటి వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారని తెలిపారు. దీన్ని సుధాకరరెడ్డి కొడుకు పాటిల్ భరత కుమార్ రెడ్డి జీర్ణించుకోలేక, తన తల్లి సుగుణమ్మ అలియాస్ నిర్మలతోనూ, మేనమామలైన దేవేంద్రరెడ్డి, గోవర్ధర్రెడ్డితో మంతనాలు జరిపి కోటిరెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడని అన్నారు. వీరి రెస్టారెంటులో పనిచేస్తున్న పనివారిని కలుపుకుని హత్యకు పథకం పన్నాడని పేర్కొన్నారు. ఈ నెల ఆరంభం నుంచి రెక్కీ నిర్వహించారని, భరత సింహారెడ్డి సమీప బంధువులైన మాలతి, ఆమె కొడుకు అబ్దుల్లా, పనిమనిషి గోవిందు సాయంతో కోటిరెడ్డి కదలికలను గమనించారని తెలిపారు. భరత సింహారెడ్డి, సుబ్బరాయుడు, ప్రకాశ గౌడ్ ఈ నెల 14వ తేదీ సాయంత్రం కోటిరెడ్డి ఇంటికి వెళ్లారని తెలిపారు. ఇంటి బయట ప్రకాశకాపలా ఉండగా, భరత సింహారెడ్డి, సుబ్బరాయుడు లోనికి వెళ్లారని, కాసేపు మాట్లాడిన భరత సింహారెడ్డి తన వద్ద ఉన్న కత్తితో కోటిరెడ్డిని పొడిచి, గొంతుకోసి హత్యచేశాడని తెలిపారు. అడ్డు వచ్చిన కారు డ్రైవరు షెక్షావలిని కూడా పొడిచి చంపారని తెలిపారు. హత్య ఆధారాలు లభించకుండా, కోటిరెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాల హార్డ్డ్రైవ్ను నిందితులు తీసుకెళ్లి నిప్పుపెట్టారని తెలిపారు. గుత్తి పట్టణ సమీపంలోని బాట సుంకులమ్మ ఆలయం వద్ద నిందితులను సోమవారం ఉదయం 8 గంటలకు అదుపులోకి తీసుకుని, రెండు కార్లను, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. హత్యకు వాడిన కత్తిని, హార్డ్ డ్రైవ్ శిథిలాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో సీఐలు గణేశ, రామసుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.