తెలుగుదేశమే గుడి.. ఎన్టీఆర్ ట్రస్టే బడి
ABN , First Publish Date - 2023-03-31T00:21:46+05:30 IST
మా కన్న తండ్రిని వైఎస్ గ్యాంగ్ కడతేర్చితే.. తెలుగుదేశమే తమకు గుడి, ఎన్టీఆర్ ట్రస్ట్ బడి అయిందని పెనుకొండ నియోజకవర్గంలోని కురుబవాండ్లపల్లికి చెందిన అన్నదమ్ములు సాయిచరణ్, మోహన అన్నారు
లోకేశకు కృతజ్ఞతలు తెలిపిన అన్నదమ్ములు
హిందూపురం, మార్చి 30: ‘మా కన్న తండ్రిని వైఎస్ గ్యాంగ్ కడతేర్చితే.. తెలుగుదేశమే తమకు గుడి, ఎన్టీఆర్ ట్రస్ట్ బడి అయిందని పెనుకొండ నియోజకవర్గంలోని కురుబవాండ్లపల్లికి చెందిన అన్నదమ్ములు సాయిచరణ్, మోహన అన్నారు. యువగళం పాదయాత్రలో గుట్టూరు సమీపంలో గురువారం వారు లోకేశను కలిశారు. టీడీపీ కార్యకర్తగా చురుగ్గా ఉన్న తమ తండ్రి మధురమోహనని 2004లో అప్పటి కాంగ్రెస్ నాయకులు, వైఎస్ రాజశేఖర్రెడ్డి మనుషులు హత్య చేశారని అన్నారు. ఏ పాపం తెలియని తమకు రాజకీయాలు శాపం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కష్టకాలంలో తమను అక్కున చేర్చుకుని.. తెలుగుదేశం పార్టీ గుడి అయిందని అన్నారు. తమ భవిష్యత్తు బాధ్యతను ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుందని కృతజ్ఞతలు తెలిపారు. సాయిచరణ్ ఇంటర్ వరకు ఎన్టీఆర్ స్కూల్లో చదువుకున్నారు. బీటెక్ పూర్తిచేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మోహన ఎన్టీఆర్ విద్యాసంస్థలో ఇంటర్ పూర్తి చేసి, ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నాడు. తమకు ఇంతచేసిన తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని వారు లోకేశతో అన్నారు. లోకేశ వారిని అక్కున చేర్చుకుని యోగక్షేమాలను తెలుసుకున్నారు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.