ట్యాబ్స్ షో
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:22 AM
జిల్లాలో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్స్ పంపిణీ ప్రహసనంగా మారింది. తొలి రోజు ఇచ్చినట్టే ఇచ్చి...వెనక్కు తీసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఫ ట్యాబ్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు ఫ బైజూస్ కంటెంట్ ఎక్కించలేదంటూ మెలిక
ఫ 22,640 మంది పిల్లలుంటే... జిల్లాకు 5,270 మాత్రమే
ఫ మిగిలినవి మళ్లీ ఇస్తారట ఫ ట్యాబ్స్ పంపిణీకి సమ్మె ఎఫెక్ట్
ఫ ఇదేంది జగన మామా...! అనంతపురం విద్య, డిసెంబరు 21: జిల్లాలో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్స్ పంపిణీ ప్రహసనంగా మారింది. తొలి రోజు ఇచ్చినట్టే ఇచ్చి...వెనక్కు తీసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి కార్యక్రమం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఉదయమే విద్యార్థులు వారి తల్లిదండ్రులను స్కూల్కు పలిపించారు. ఉదయం 11.30 గంటల తర్వాత ట్యాబ్స్ పంపిణీ చేపట్టారు. ఇనచార్జి డీఈఓ నాగరాజు, ఏపీసీ వరప్రసాద్ మరికొందరు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అట్టహాసంగా పంపిణీ చేశారు. పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిచి ట్యాబ్స్ ఇచ్చారు. పట్టుమని 15 మందికి కూడా ఇచ్చారో లేదో.... ‘‘ఇక దిగండి ఫొటోలు’’ అంటూ... ఫొటోలు దిగి సందడి చేశారు. జగన మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి... అంటూ పిల్లలతో శుభాకాంక్షలు చెప్పించారు. షో అంతా ముగిసింది. ఇక అంతే విద్యార్థులు పాతిక నిమిషాలు కూడా చేతుల్లో పట్టుకున్నారో లేదో వెంటనే వెనక్కు తీసుకున్నారు. ట్యాబ్స్లో ఎస్డీ (సెక్యూర్డ్ డిజిటల్) కార్డ్ వేయలేదని, ఇంకా బైజ్యూస్ కంటెంట్ కూడా లోడ్ చేయలేదని, కార్డులు వేసి, కంటెంట్ నింపిన తర్వాత ఇస్తామంటూ...విద్యార్థుల నుంచి వాటిని వెనక్కు తీసుకున్నారు. తరువాత ట్యాబ్స్ బాక్సుల్లో పెట్టేశారు. దీంతో విద్యార్థుల మొహం చిన్నబుచ్చుకున్నారు.
మండలానికి 170 మాత్రమేనట...
జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులు 22,640 మం ది ఉన్నారు. వారందరికీ ట్యాబ్స్ ఇవ్వాలి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి జిల్లాకు కేవలం 5270 మాత్రమే వచ్చినట్లు జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. ఫేజ్-1 కింద మండలానికి కేవలం 170 మాత్రమే పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. వచ్చిన వాటిలో కూడా కొన్ని పంపిణీ చేసి, పలు కారణాలు చెప్పి వెనక్కు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమ పిల్లలకు తమ కళ్ల ఎదుటే...ట్యాబ్స్ ఇచ్చినట్టే వెనక్కు తీసుకోవడంతో..పలువురు తల్లిదండుల్రు ఇదేం మామ అంటూ పెదవి విరిచారు. జిల్లా వ్యాప్తంగా మండలానికి 170 ట్యాబ్స్ వస్తే...కొన్ని స్కూళ్లలో కొన్ని పంపిణీ చేసి, తర్వాత పంపిణీ చేస్తాం అంటూ షో చేయడం విమర్శలకు తావిస్తోంది.
ట్యాబ్స్ పంపిణీపై సమ్మె ఎఫెక్ట్...
ట్యాబ్స్ పంపిణీపై సమ్మె ఎఫెక్ట్ పడింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఎమ్మార్సీ, సమగ్రశిక్ష సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. మండల వనరుల కేంద్రాల(ఎమ్మార్సీలు)కు తాళలు వేసి... విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. ట్యాబ్స్లో ఎస్డీ కార్డ్ ఇనసర్ట్ చేయడం, బైజూస్ కంటెంట్ లోడ్ చేయడం, 8వ తరగతి విద్యార్థుల చైల్డ్ ఐడీ నెంబర్ల వారీగా... వారికి అందించే ట్యాబ్స్ వివరాలను ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అంతా ఎమ్మార్సీల్లో ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సీఆర్పీలు చేతుల మీదుగా సాగుతుంది. అయితే ఇప్పుడు వారంతా సమ్మెలో ఉండటంతో ట్యాబ్స్ పంపిణీపై ప్రభావం పడింది.