విజ్ఞాన కేంద్రంలో మూఢనమ్మకం
ABN , First Publish Date - 2023-06-07T00:35:16+05:30 IST
సాంకేతిక విద్యా విజ్ఞాన కేంద్రంలో మూఢనమ్మకాలు తిష్టవేశాయి. జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలకు వాస్తు దోషం పట్టుకుంది. ప్రధాన పరిపాలనా విభాగం గేటుకు తాళం పడింది. 75 ఏళ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఇంజనీర్లుగా సమాజానికి అందించిన విజ్ఞానకేంద్రం ఇది
జేఎనటీయూకు వాస్తు దోషమట
పరిపాలనా విభాగానికి తాళం
ఇరుకు దారిలో అవస్థలు
యాజమాన్యంపై సర్వత్రా విమర్శలు
అనంతపురం సెంట్రల్, జూన 6: సాంకేతిక విద్యా విజ్ఞాన కేంద్రంలో మూఢనమ్మకాలు తిష్టవేశాయి. జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలకు వాస్తు దోషం పట్టుకుంది. ప్రధాన పరిపాలనా విభాగం గేటుకు తాళం పడింది. 75 ఏళ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఇంజనీర్లుగా సమాజానికి అందించిన విజ్ఞానకేంద్రం ఇది. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. మానవ జీవన ప్రమాణాలను పరుగులెత్తిస్తున్న నేటి ఆఽధునిక సమాజంలో.. జేఎనటీయూక మూఢనమ్మకాల మరకంటించారు. విద్యార్థి, ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఇలాంటి ఆచారాలను అనుసరించడం ఏంటని పూర్వ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కళాశాల ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. కళాశాలలో ఇలాంటి మూఢనమ్మకాలు పాటించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థులు ఫీజుల చెల్లింపులు, స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ దరఖాస్తు, నోడ్యూస్ సర్టిఫికెట్.. ఇలా పలు పనులపై పరిపాలనా కార్యాలయానికి వెళ్లాల్సి వుంటుంది. అదేవిధంగా ఉద్యోగ, సిబ్బంది వివరాల నమోదు, బిల్ క్లైమ్స్, జీపీఎఫ్, ఎస్ఆర్ తదితర పనులపై తరచూ వచ్చిపోతుంటారు. కళాశాలలో కీలకమైన పాలనా కార్యాలయానికి వాస్తుపేరుతో తాళం వేయడంపై కళాశాల వర్గాలు మండిపడుతున్నాయి.
రాకపోకలకు అవస్థ
జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆరు బ్రాంచలు, ల్యాబ్లు, పలు విభాగాలు ఉన్నాయి. వాటి నిర్వహణతో పాటు స్వీపర్ నుంచి ప్రొఫెసర్లు, విభాగాధిపతుల వరకు జీతభత్యాలు వంటి విధిపరమైన అంశాలకు సంబంధించి పరిపాలనా కార్యాలయం కీలకమైంది. వాస్తుపేరుతో తాళం వేయించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిపాలనా విభాగానికి ఈ గేటు నుంచే అధికారులు, సిబ్బంది, విద్యార్థులు రాక పోకలు సాగిస్తున్నారు. డిప్యూటీ రిజిస్ర్టార్, ఇద్దరు అసిస్టెంట్ రిజిస్ర్టార్లతో పాటు సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న దారి పొడవునా పాత బీరువాలు, ఇనుము అలమరాలు, టేబుల్స్ వంటి వస్తువులు పేర్చారు. గేటు ముందే మహిళల టాయిలెట్ ఉంది. నిత్యం వందలాది మంది ఈ దారిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇదేమి వాస్తు అంటూ మండిపడుతున్నారు.
గంటల తరబడి నిరీక్షణ
కళాశాల భవనంపైకి మెట్ల మార్గంలో చేరుకోగానే కుడివైపు ప్రిన్సిపాల్ కార్యాలయం ఉంది. కార్యాలయ తలుపునకు ఎదురుగా పరిపాలనా విభాగం గేటు ఉంటుంది. అక్కడే ఏ విభాగంలోకి ఏ ద్వారం గుండా వెళ్లాలో నేమ్బోర్డులు ప్రదర్శించారు. అయితే గేటుకు తాళం వేయడంతో పనులపై వచ్చే విద్యార్థులు, ఇతరులు గంటల తరబడి వేచిచూస్తున్నారు. కార్యాలయానికి సెలవు ప్రకటించారా? ఉద్యోగులు, సిబ్బంది భోజనానికి వెళ్లారా? అంటూ అక్కడే ఉండిపోతున్నారు. చివరికి విసుగెత్తి ఎందుకు తాళం తీయడం లేదని అటుగా వెళ్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
వాస్తు సరిగాలేదు... - ప్రొఫెసర్ సుజాత, జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్
పరిపాలనా విభాగానికి వాస్తు బాగా లేదు. దీంతో ప్రధాన గేటుకు తాళం వేయించాం. ఈ గేటు నుంచి కాకుండా అటువైపు ఉన్న మరోగేటును తెరిచాము. ఎప్పటి నుంచో పరిపాలనా విభాగానికి ఉన్న గేటుకు తాళం వేయడంతో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తికమకపడుతుంటారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన దారివైపుగా వెళ్లేందుకు అలవాటు పడేందుకు కొంత కాలం పుడుతుంది. బీరువాలు, ఇతర సామగ్రిని తరలించి, రాకపోకలకు ఇబ్బందిలేకుండా చూస్తాం.