న్యాయవిద్యకు నిబంధనల సంకెళ్లు
ABN , First Publish Date - 2023-12-11T00:52:14+05:30 IST
న్యాయవిద్యా కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అర్హులైన విద్యార్థులకు కన్వీనర్ కోటాకింద సీట్లను అలాట్ చేసింది. అయితే సంబంధిత విద్యార్థులను చేర్చుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పలు కొర్రీలను పెడుతోంది.
విద్యార్థుల సీట్ల అలాట్మెంట్కు ‘నో’
కొర్రీలు పెడుతున్న కళాశాల యాజమాన్యం
ప్రవేశాలు కోల్పోతున్న విద్యార్థులు
అనంతపురం సెంట్రల్, డిసెంబరు10: న్యాయవిద్యా కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అర్హులైన విద్యార్థులకు కన్వీనర్ కోటాకింద సీట్లను అలాట్ చేసింది. అయితే సంబంధిత విద్యార్థులను చేర్చుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పలు కొర్రీలను పెడుతోంది. అడ్మిషన కావాలంటే ఇదివరకు ఎక్కడా ఉద్యోగంచేసి ఉండకూడదని, దూరవిద్య, ఓపెన స్కూల్, వనసిట్టింగ్ మార్కుల జాబితాలు చెల్లవని ఇలా పలురకాల నిబంధనలు విధించింది. ఈ నిబంధనలతో విజయనగర లా కళాశాల అధికారులు తమకు అడ్మిషన ఇవ్వడంలేదని బాధిత విద్యార్థులు వాపోతున్నారు. శనివారంతో సెల్ప్ రిపోర్టింగ్ గడువు ముగియడంతో విద్యార్థులు వ్యయ ప్రయాసాలకోర్చి వారి సర్టిఫికెట్స్, సీట్ అలాట్మెంట్ రసీదుతో కళాశాలకు చేరుకున్నారు. అయితే కళాశాల యాజమాన్యం నిబంధనల పేరుతో అడ్మిషన రాదని చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులను బ్రతిమాలాడినా తాము ఏమిచేయలేమని వారు చేతులెత్తేశారు.
పలు కోర్రీలు...
సాప్ట్వేర్ ఉద్యోగం చేసిన ఒక విద్యార్థికి ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సులో సీటు అలాట్ అయింది. అతడికి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఉందంటూ నిరాకరించారు. మరొక విద్యార్థికి బీబీఏఎల్ఎల్బీ సీటు అలాట్ అయింది. అతడు ఇంటర్మీడియేట్ ఓపెన స్కూల్లో చదివాడని అడ్డంకి చెప్పారు. ఇంకో విద్యార్థికి ఒరిజినల్ టీసీ లేదని, అది సమర్పించిన తరువాతే అడ్మిషన సంగతి చూస్తామని తెలిపారు. ఇలా అనేక మంది విద్యార్థులు.. ప్రవేశాలకు నోచుకోకపోవడంతో తమ భవిష్యత్తును ఎలా కాళ్లరాస్తారని మండిపడుతున్నారు.
నిబంధనలు ఎత్తివేయాలి...
అడ్మిషన కోసం కళాశాల అధికారులు విధించిన నిబంధనలు ఎత్తివేయాలి. అర్హతలేకుంటే లాసెట్ పరీక్షలు ఎలా రాస్తాము? ప్రభుత్వం సీట్ అలాట్మెంట్ ఎలాచేస్తుంది.? అడ్మిషన ఇవ్వకపోతే భవిష్యత్తును కోల్పోవాల్సిందే. శనివారంతో సెల్ప్రిపోర్టింగ్ గడువు ముగియడంతో అనేకమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం స్పందించి సీట్ అలాట్ అయిన విద్యార్థులందరికీ అడ్మిషన ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.
- రోహిత, బాధిత విద్యార్థి
బీసీఐ నిబంధనలు పాటిస్తున్నాం..
న్యాయ విద్యాకోర్సుల ప్రవేశాల ప్రక్రియకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఏ) విధించిన నిబంధనలను పాటిస్తున్నాం. నిబంధనల మేరకు అనేకమంది విద్యార్థులు అడ్మిషనకు అనర్హులయ్యారు. ఆ విషయాలను నోటీసు బోర్డులో ప్రదర్శించి విద్యార్థులకు వివరిస్తున్నా అర్థం చేసుకోవడంలేదు. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మా చేతుల్లో ఏమీ లేదు.
-డాక్టర్ రాఘవేంద్రాచార్, విజయనగర లా కళాశాల ప్రిన్సిపాల్