ఇంత అన్యాయమా..?
ABN , First Publish Date - 2023-06-07T00:25:51+05:30 IST
అనంతపురం రూరల్ మండలంలోని పామురాయి నుంచి తాడిపత్రి బుగ్గకోన వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి-544 ఇళ్లు కోల్పోతున్నవారికి పరిహారం చెల్లింపులో అధికార పార్టీ మార్కు కనిపిస్తోంది. బాధితులకు స్లాబ్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాల్సిందిపోయి..
ఇష్టారాజ్యంగా ఎనహెచ 544 పరిహారం
ఇళ్లు కోల్పోతున్నవారి పట్ల అధికారుల వివక్ష
అధికార పార్టీవారికి భారీగా.. ఇతరులకు తక్కువగా..
విమర్శలు రావడంతో రీ సర్వేకి నిర్ణయం
బుక్కరాయసముద్రం, జూన 6: అనంతపురం రూరల్ మండలంలోని పామురాయి నుంచి తాడిపత్రి బుగ్గకోన వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి-544 ఇళ్లు కోల్పోతున్నవారికి పరిహారం చెల్లింపులో అధికార పార్టీ మార్కు కనిపిస్తోంది. బాధితులకు స్లాబ్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాల్సిందిపోయి.. రాజకీయముద్ర వేసి కొందరికి అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఆర్ అండ్ బీ అధికారులు అధికార పార్టీవారికి భారీగా పరిహారం నిర్ణయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నాయకుల కనుసన్నల్లో పరిహారం నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. సామాన్యులు, టీడీపీ సానుభూతిపరులకు తక్కువ పరిహారం నిర్ణయించారని విమర్శలు వస్తున్నాయి. రోటరీపురంలో 135 మందికి సంబంధించిన ఇళ్లు, ప్రహరీలు, దుకాణాలను తొలగిస్తున్నారు. వీరందరికీ రూ.6.94 కోట్ల పరిహారం ఇచ్చేలా గతంలో నివేదికలు సిద్ధం చేశారు.
వైసీపీ మార్క్
రోటరీపురంలో ఓ వైసీపీ నాయకుడి ఇల్లు విస్తరణలో పోయింది. ఈ ఇంటికి సంబంధించి ఆరుగురి పేరిట పరిహారం కోరారు. పాత ఇంటికి ఏకంగా రూ.80 లక్షల వరుకు పరిహారం వచ్చేలా నివేదిక సిద్ధం చేశారు. ఇదే రోడ్డులో టీడీపీ కార్యకర్త మూడేళ్ల క్రితం దాదాపు రూ.45 లక్షల వ్యయంతో ఇంటిని నిర్మించుకున్నాడు. ప్రభుత్వ ధర ప్రకారం 11 చదరాల స్లాబ్ రేటు కింద ఒక చదరానికి కనీసం రూ.1.60 లక్షలు ఇవ్వాలి. కానీ మొత్తం రూ.14 లక్షలు మాత్రమే వచ్చేలా నిర్ణయించారు. వైసీపీ వర్గీయుడి పంక్చర్ షాపునకు ఏకంగా రూ.6 లక్షలు పరిహారం నిర్ణయించారు. కానీ హనుమంతు అనే వ్యక్తికి చెందిన చికెన దుకాణానికి కేవలం రూ.3 లక్షల పరిహారం నిర్ణయించారు.
నేడు రీసర్వే
పరిహారం విషయంలో విమర్శలు రావడంతో ప్రభుత్వం రీ సర్వే చేయించాలని నిర్ణయించింది. రీ సర్వే కోసం అనంతపురం ఆర్అండ్బీ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు విజయవాడ నుంచి ప్రత్యేక బృందం వస్తోందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
కనీసం రూ.40 లక్షలు ఇవ్వాలి
రోడ్డు విస్తరణలో నా ఇల్లు పూర్తిగా పోయింది. ఇంటిని నిర్మించి నాలుగేళ్లు కూడా కాలేదు. అప్పటికే రూ.30 లక్షలకు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వం నాకు రూ.23 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. నాకు అన్యాయం జరుగుతోంది. కనీసం రూ.40 లక్షలు పరిహారంతో పాటు ప్రభుత్వం స్థలం ఇవ్వాలి.
- తరిపోగల వెంకటనాయుడు
రూ.5 లక్షలే..
గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. ఇంత ఇంటికి కేవలం రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని అంటున్నారు. మేము టీడీపీలో ఉన్నందుకే తక్కువ పరిహారం ఇస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వాటికి కనీసం రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి. దీంతోపాటు ప్రభుత్వ స్థలం ఇవ్వాలి.
- వడ్డే నాగరత్నమ్మ