Share News

ప్రకృతిని రక్షించకపోతే మానవాళికి ముప్పు తప్పదు

ABN , First Publish Date - 2023-12-11T00:08:26+05:30 IST

పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవాళికి ముప్పు తప్పదని పర్యావరణ వేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తమరెడ్డి హెచ్చరించారు.

ప్రకృతిని రక్షించకపోతే మానవాళికి ముప్పు తప్పదు

కుందుర్పి, డిసెంబరు 10: పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవాళికి ముప్పు తప్పదని పర్యావరణ వేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తమరెడ్డి హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం ప్రకృతి, సుస్థిరతకు విలువలతో కూడిన జీవన శైలి అనే అంశంపై ఎస్‌కే చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ పర్యావరణ వేత్తలు పబ్లిక్‌ పాలసీ రూపకర్తలు అయిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పురుషోత్తమరెడ్డి, దొంతి నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు, పెట్రోలియం వంటి వాటిని విపరీతంగా వినియోగిస్తుండటంతో వాతావరణంలో వేడి పెరుగుతోందన్నారు. ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకుని పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. వాతావరణంలో రేడియేషన్‌ ఫలితంగా కొన్ని పక్షులు, జంతువులు అంతరించిపోయాయన్నారు. అనంతరం ఇటీవల కర్మవీరచక్ర అవార్డును అందు కున్న రైతు నారాయణను పర్యావరణ శాస్త్రవేత్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కే చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకులు లెనినబాబు, సభ్యులు జగదీష్‌, రాజు, బొమ్మలింగ, రఘువీరా, దిలీప్‌, శ్రీకాంత్‌, ఉమాదేవిలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన విలువల బడి ఉపాధ్యాయులు, రైతులు, యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:08:28+05:30 IST