తొలగించిన చోటే ఇళ్లు కట్టివ్వాలి
ABN , First Publish Date - 2023-11-10T00:53:22+05:30 IST
గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారంలో పేదల గుడిసెలను తొలగించిన చోటే ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వామపక్ష, దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 6న సీపీఎం చేపట్టిన స్కూటర్ యాత్ర గురువారం రుద్రంపేటకు చేరుకుంది.
సీపీఎం, ప్రజా సంఘాల డిమాండ్
కల్లూరు బాధితులకు మద్దతుగా ధర్నా
అనంతపురం కల్చరల్, నవంబరు 9: గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారంలో పేదల గుడిసెలను తొలగించిన చోటే ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వామపక్ష, దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 6న సీపీఎం చేపట్టిన స్కూటర్ యాత్ర గురువారం రుద్రంపేటకు చేరుకుంది. అక్కడ యాత్రకు సీపీఎం నగర కమిటీ స్వాగతం పలికింది. అనంతరం యాత్ర కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కల్లూరులో నివాసాలు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని, అనుచితంగా వ్యవహరించిన సీఐ నరేందర్రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు ఏసురత్నం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చిన్న ఆంజనేయులు, ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ చైర్మన సాకే హరి, జైభీమ్ సేన జిల్లా నాయకుడు తరిమెల రామాంజనేయులు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే ఉన్నఫలంగా తొలగించి, వారిని రోడ్లపై పడేశారని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని వైసీపీ నాయకులు పేదలపై దౌర్జన్యాలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. అదే స్థలంలో అధికార పార్టీ నేతలు, ఇతరులు ఇళ్లు నిర్మించుకున్నారని, కొందరు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నా ఎలాంటి చర్యలు లేవని అన్నారు. దళిత, గిరిజనులు, నిరుపేదలు గుడిసెలు వేసుకున్న రెండు ఎకరాల భూమిని ఖాళీ చేయించేందుకు దేవదాయశాఖ అధికారులు చట్టాన్ని ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు దిశానిర్దేశాలను పట్టించుకోకుండా, ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. సీపీఎం, దళిత సంఘాల నాయకులను కులంపేరుతో దూషించిన సీఐ నరేందర్రెడ్డి అమానవీయంగా వ్యవహరించారని, మహిళలను సైతం బూతులు తిట్టారని అన్నారు. పోలీసు అధికారి అయ్యుండి.. రౌడీలా రెచ్చిపోయిన సీఐకి చట్టపరంగానే గుణపాఠం నేర్పుతామని అన్నారు.