రైతులవి ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలు: జేసీపీఆర్
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:33 AM
రాష్ట్రంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలు ప్రభు త్వ హత్యలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఘాటుగా విమర్శించారు.
పామిడి, డిసెంబరు 22: రాష్ట్రంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలు ప్రభు త్వ హత్యలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఘాటుగా విమర్శించారు. పెద్దవడుగూరు గ్రామానికి చెందిన రైతు గోవిందు(65) ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఎన్నో ఆశలతో ఆయకట్టు కింద పంట సాగుచేశారన్నారు. ఆ పంటలు కోత దశలో ఉండగా ఉన్నఫలంగా ఆయకట్టుకు నీరు నిలిపివేశారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ల అక్రమాలు కప్పిపుచ్చేందుకు డ్యాంలలోని నీరు వృథా చేశారని మండిపడ్డారు. ఆ పర్యావసానం పంటలు సాగు చేసే రైతుల పై పడిందని ధ్వజమెత్తారు. చేసిన అప్పులు తీర్చలేక దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి శివకుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, హమాలీ గోపాల్ పాల్గొన్నారు.