అంతా షో..!
ABN , First Publish Date - 2023-06-03T00:51:50+05:30 IST
జిల్లా స్థాయి ట్రాక్టర్స్ మెగా మేళాలో వ్యవసాయ శాఖ అధికారులు షో చేశారు. 2022-23లో వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద సీహెచసీ ద్వారా రైతు బృందాలకు ట్రాక్టర్లు, ట్రాక్టర్ పరికరాలు మంజూరు చేశారు.

పాతవాటితో మెగా మేళా.. అధికారుల తీరుపై విమర్శలు
అనంతపురం అర్బన, జూన 2: జిల్లా స్థాయి ట్రాక్టర్స్ మెగా మేళాలో వ్యవసాయ శాఖ అధికారులు షో చేశారు. 2022-23లో వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద సీహెచసీ ద్వారా రైతు బృందాలకు ట్రాక్టర్లు, ట్రాక్టర్ పరికరాలు మంజూరు చేశారు. మెగా మేళాలో 171 ట్రాక్టర్లు, 1,161 ట్రాక్టర్ పరికరాలు, 3 కంబైన హార్వెస్టర్లను రైతులకు పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. ఐదు మాసాల క్రితమే పలు రైతు బృందాలకు ట్రాక్టర్లు, పరికరాలు పంపిణీ చేశారు. సీఎం జగన శుక్రవారం మెగా మేళా చేపట్టడంతో కొన్ని నెలల క్రితం పంపిణీ చేసిన పదుల సంఖ్యలో ట్రాక్టర్లను మెగా మేళాకు తెప్పించారు. వినియోగంలో ఉన్నవాటిని తీసుకురమ్మని రైతులపై ఒత్తిడి చేశారు. చేసేది లేక రైతులు పనులను వదులుకుని గురువారం సాయంత్రమే అనంతపురం అర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న మహిళా క్రీడా మైదానానికి ట్రాక్టర్లు తెచ్చారు. ఇదివరకే పంపిణీ చేసిన ట్రాక్టర్ పరికరాలను కూడా మెగా మేళాలో ఉంచారు. ఇదివరకే పొలం పనులు చేయడంలో కొన్ని ట్రాక్టర్ల టైర్లు అరిగిపోయాయి. అలాంటి వాటిని తెప్పించడం విమర్శలకు తావిచ్చింది. తాజాగా మంజూరు చేసిన ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేస్తే బాగుంటుందని, ఇదివరకే పంపిణీ చేసిన ట్రాక్టర్లను తెప్పించి షో చేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు.
రైతు సంక్షేమమే ధ్యేయం: కలెక్టర్
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. యంత్రసేవ రెండో విడతలో ట్రాక్టర్లు, పరికరాలు, కంబైన హార్వెస్టర్లు రైతులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తామని, వాటిని మద్దతు ధరతో కొంటామని అన్నారు. అనంతరం యంత్రసేవ పథకం మెగా చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్ ఖాన, ఉద్యాన అధికారి రఘునాథ్రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు గైర్హాజరయ్యారు. జడ్పీ చైర్ పర్సన గిరిజమ్మ, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన రాజశేఖర్రెడ్డి, ఏడీసీసీబీ చైర్పర్సన లిఖిత మాత్రమే హాజరయ్యారు.