మంజూరైన ప్రతి ఇల్లూ గ్రౌండింగ్‌ కావాలి

ABN , First Publish Date - 2023-06-14T00:15:40+05:30 IST

పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి ఇల్లూ గ్రౌండింగ్‌ కావాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంజూరైన ప్రతి ఇల్లూ గ్రౌండింగ్‌ కావాలి

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌

నల్లమాడ, జూన 13: పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి ఇల్లూ గ్రౌండింగ్‌ కావాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన దొన్నికోట, రెడ్డిపల్లిలో జగనన్న కాలనీలను పరిశీలించారు. దొన్నికోట గ్రామంలో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తున్న వాటిని తనిఖీ చేశారు. లబ్ధిదారులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిమెంటు, బిల్లులు సక్రమంగా అందిస్తున్నారా, సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది లబ్ధిదారులు సిమెంటు ఇవ్వలేదని, కేంద్రం మంజూరు చేసిన రూ. ఐదు వేలు పడ్డాయని, మిగిలినవి పడలేదన్నారు. వాటిని వెంటనే పరిశీలించి బిల్లులు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రెడ్డిపల్లిలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇళ్లు మంజూరై, పనులు మొదలు పెట్టని వారుంటే, రెండు రోజుల్లో గ్రౌండింగ్‌ చేయాలని తెలిపారు. ఆలస్యం ఎందుకైందని అధికారులపై మండిపడ్డారు. నిర్లక్ష్యం చేస్తే అధికారులు, ఇంజనీరు అసిస్టెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇళ్లు మంజూరై ప్రారంభంకాని ఇళ్లు అధికంగా ఉన్నాయని, బుధవారం లోపు ప్రతి ఇంటిని గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశించారు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. కలెక్టర్‌ వెంట స్పెషలాఫీసర్‌ నిర్మలజ్యోతి, డీఈ షామీర్‌బాషా, పీడీ చంద్రమౌలిరెడ్డి, తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌, ఎంపీడీఓ కొండన్న, హౌసింగ్‌ ఏఈ వరుణ్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-14T00:15:40+05:30 IST