Share News

అరగంటలో ఖాళీ చెయ్‌..!

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:31 AM

తెలుగుదేశం పార్టీకోసం చురుగ్గా పనిచేస్తున్న శ్రీధర్‌ అనే కార్యకర్తను వైసీపీ నాయకులు బెదిరించారు. చెన్నేకొత్తపల్లిలో శ్రీధర్‌ అద్దె బంకులో చికెన సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆ బంకును అరగంటలోగా ఖాళీ చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గురువారం రాత్రి బెదిరించారు.

అరగంటలో ఖాళీ చెయ్‌..!
చెన్నేకొత్తపల్లిలో టీడీపీ కార్యకర్తను బెదిరిస్తున్న వైసీపీ నాయకులు

టీడీపీ కార్యకర్తకు వైసీపీ బెదిరింపులు

చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 29: తెలుగుదేశం పార్టీకోసం చురుగ్గా పనిచేస్తున్న శ్రీధర్‌ అనే కార్యకర్తను వైసీపీ నాయకులు బెదిరించారు. చెన్నేకొత్తపల్లిలో శ్రీధర్‌ అద్దె బంకులో చికెన సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆ బంకును అరగంటలోగా ఖాళీ చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గురువారం రాత్రి బెదిరించారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. శ్రీధర్‌ ప్రోబ్బలంతోనే వారు టీడీపీలో చేరారని స్థానిక వైసీపీ నాయకులు కక్ష సాధింపునకు దిగారు. ముందుగా గ్రామ సచివాలయానికి పిలిపించి దుకాణాన్ని తక్షణమే ఖాళీ చేయాలని పంచాయతీ కార్యదర్శి ద్వారా ఒత్తిడి చేయించారు. అందుకు శ్రీధర్‌ అంగీకరించకపోవడంతో పలువురు వైసీపీ నాయకులు రాత్రి దుకాణం వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగారు. ‘ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తావా? ఏమనుకుంటున్నావు? నీ అంతు చూస్తాం..’ అని తనను బెదిరించారని, నానా దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు. వైసీపీ నాయకుల తీరును టీడీపీ నాయకులు ఖండించారు. వైసీపీకి అధికారం శాశ్వంత కాదని, వారి దౌర్జన్యాలు చాలా కాలం సాగవని అన్నారు. అరాచకాలను మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేసు హెచ్చరించారు.

Updated Date - Dec 30 , 2023 | 01:31 AM