నేటి నుంచి సైకిల్‌ యాత్ర : ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2023-08-22T23:54:26+05:30 IST

జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి ఈనెల 30 వరకు విద్యార్థి సంగ్రామ పేరుతో సైకిల్‌ యాత్రను చేపడుతున్నామని, దాన్ని జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్‌ కోరారు.

నేటి నుంచి సైకిల్‌ యాత్ర : ఎస్‌ఎఫ్‌ఐ
మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 22 : జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి ఈనెల 30 వరకు విద్యార్థి సంగ్రామ పేరుతో సైకిల్‌ యాత్రను చేపడుతున్నామని, దాన్ని జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్‌ కోరారు. మంగళవారం స్థానిక గణేనాయక్‌ భవనలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సెంట్రల్‌ యూనివర్సిటీకి సంబంధించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా కనీసం ప్రహరీ కూడా పూర్తి చేయలేదని, యూనివర్సిటీలో అధ్యపక పోస్టులను భర్తీ చేయలేదని అన్నారు. విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో అనేక సమస్యలెదుర్కొంటున్నారని, భవనాలకు పెచ్చులూడిపోయి శిథిలావస్థకు చేరుకున్నా ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు, కాస్మొటిక్‌ చార్జీలను ఇవ్వడం లేదని తెలిపారు. శింగనమల, ఉరవకొండ, తాడిపత్రి, ఆత్మకూరు, గుత్తి జూనియర్‌ కళాశాలల్లోనూ సరైన సదుపాయాల్లేవన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు అనుబంధ హాస్టళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న సంగ్రామ సైకిల్‌ యాత్రలో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బుధవారం తాడిపత్రిలో ఈ సైకిల్‌ యాత్ర ప్రారంభమై గుత్తి, గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం మీదుగా ఈనెల 30న అనంతపురం చేరుకుని యాత్ర ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సూర్యప్రకాష్‌, వెంకటేష్‌, శివ, వర్దన, రాజేష్‌, చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:54:26+05:30 IST