అంగనవాడీల జీతాలు పెంచింది చంద్రబాబే
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:05 AM
అంగన వాడీలకు జీతాలు పెంచిన ఘనత చంద్ర బాబుకే దక్కుతుందని, ముఖ్యమంత్రి జగన అంగన వాడీలపై ఉక్కు పాదం మోపుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి
మడకశిరటౌన, డిసెంబరు 17: అంగన వాడీలకు జీతాలు పెంచిన ఘనత చంద్ర బాబుకే దక్కుతుందని, ముఖ్యమంత్రి జగన అంగన వాడీలపై ఉక్కు పాదం మోపుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని టీడీపీ కార్యాయం లో విలేకరులతో మాట్లాడారు. అంగనవాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తామని ఎన్నికలకు మునుపు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే మడమ తిప్పారన్నారు. 2014 సంవత్సరానికి ముందు అంగన వాడీల జీతాలు రూ.4200 ఉండగా ఏకంగా రూ.6300 పెంచి రూ.10,500 జీతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్ ఉన్నా జీతాలు పెంచి అంగనవాడీలకు ఆర్థిక చేయూత ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఎక్కువ బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి జగన అంగనవాడీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అంగన వాడీలకు టీడీపీ హయాంలోనే అన్ని విధాలా చేయూతను అందించి అటు చిన్న పిల్లలకు ఇటు అంగనవాడీ సిబ్బందికి చంద్రబాబు మేలు చేశార న్నారు. కానీ జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక అంగనవాడీలకు సంక్షేమ పథకాల్లో కోత విధించి వారికి అన్ని విధాలా నష్టం చేశారన్నారు. వెంటనే అంగనవాడీలకు కనీస వేతనం రూ.26వేలు, రిటైర్డ్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు, వేతనంలో సగం పింఛనతోపాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.