బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:50 PM
బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు కల్పించాలని రాయలసీమ బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు డిమాండ్ చేశారు.
రాయలసీమ బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక
పుట్టపర్తిరూరల్, డిసెంబరు 17: బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు కల్పించాలని రాయలసీమ బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన రాయలసీమ బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక సమావేశం రజక సంఘ నాయకుడు శివప్ప అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు రాజకీయపార్టీలు ప్రాధాన్యత కల్పించాలన్నారు. జనాబాలో 50 శాతానికి మించి ఉన్న బీసీ వర్గాలకు అత్యధిక రాజకీయ అవకాశాలు సాధించడమే ఐక్యవేదిక లక్ష్యమన్నారు. ప్రస్తుతం అన్నిరాజకీయపార్టీలు బీసీలను ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. బీసీల రాజకీయ చైతన్యం కోసం త్వరలోనే జిల్లాస్థాయిలో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. అనంతరం రాయలసీమ బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక కార్యవర్గాన్ని ఎన్నుకుని వారిచేత ప్రమాణం చేయించారు. ఐక్యవేదిక గౌరవాధ్యక్షులు సామకోటి ఆదినారాయణ, గఫూర్, ఉపాధ్యక్షుడు తిరుపతేంద్ర, ప్రధాన కార్యదర్శి పవనకళ్యాణ్, నాయకులు పుట్లగంగాద్రి, కేశాని ఆదినారాయణ, శ్యామల, లావణ్య, కోనప్ప, రామాంజనేయులు, సత్తి, ఉద్దండం సుధాకర్, సుబ్రహ్మణ్యం, రమణ, పార్థసారథి, హరికృష్ణ, శ్రీనివాసులు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.