అంగన్వాడీల సమస్యలు వైసీపీకి పట్టవా..?
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:42 AM
న్యాయమైన డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని పలువురు వక్తలు మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజుకు చేరుకుంది.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 23: న్యాయమైన డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని పలువురు వక్తలు మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజుకు చేరుకుంది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం అంగన్వాడీలు పూలదండలు వేసుకుని నిరసనను వ్యక్తం చేశారు. వీరి దీక్షలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్, టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల నరసింహులు, టీడీపీ నాయకులు మురళి, వెంకటకృష్ణ, యూటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు రమణయ్య, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఏపీటీఎఫ్(1928) రాష్ట్ర కార్యదర్శి కులశేఖర్రెడ్డి, సీఐటీయూ నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ... మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అంగన్వాడీల పట్ల చేస్తున్నదేంటో చెప్పాలని ప్రశ్నించారు. టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల నరసింహులు మాట్లాడుతూ... అంగన్వాడీల సమ్మెపై స్పందించకుండా... కేంద్రాల తాళాలు పగులగొట్టి ఏమి సాధించారో వైసీపీ ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, అంగన్వాడీలకు మంచిరోజులు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన నగర అధ్యక్ష కార్యదర్శులు జయభారతి, జమున, అరుణ, రుక్మిణి పాల్గొన్నారు.