పారదర్శకత ఏదీ?
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:13 AM
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా జరగని కారణంగా అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జాబితాలో తప్పులు, అవకతవకలపై బుధవారం ఆయన ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన అధికారిణికి ఫిర్యాదు చేశారు.
ఓటరు జాబితా సవరణపై కాలవ ఫిర్యాదు
రాయదుర్గం, డిసెంబరు 13: ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా జరగని కారణంగా అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జాబితాలో తప్పులు, అవకతవకలపై బుధవారం ఆయన ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన అధికారిణికి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికారుల లెక్కల ప్రకారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు పదిహేడు వేల మంది రాయదుర్గానికి తమ ఓట్లు బదిలీ చేయించుకున్నారన్నారు. వారి వివరాలు పారదర్శకంగా లేకపోవడం అనేక అనుమానాలను కలిగిస్తోందన్నారు. వైసీపీ నాయకులు హైదరాబాద్, తాడేపల్లిలో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని దొంగ ఓట్లను చేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల వల్ల ప్రజాతీర్పు ప్రభావితమయ్యే ప్రమాదముంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి వలంటీర్లను, ఎఫ్పీ షాప్ డీలర్ల కుటుంబ సభ్యులను బీఎల్ఏలుగా వైసీపీ నియమించిందన్నారు. వారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను గుర్తించి ఫారం - 7 ద్వారా తొలగించడాని కి కుట్రలు చేస్తున్నారన్నారు. తహసీల్దార్ స్థాయి అధికారులు కూడా ఈ రోజు నోటీసులు అందించి మరుసటిరోజు హాజరు కావాలని నోటీసు-14 జారీ చేస్తున్నారన్నారు. తొలగిస్తున్న, చేరుస్తున్న ఓటర్ల జాబితా వివరాలను అన్ని రాజకీయ పార్టీలకు పారదర్శకంగా ఇవ్వగలిగితే ఓటర్ల సవరణ జాబితాకు అర్థం ఉంటుందని కాలవ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బళ్లారి నుండి ఓటర్లను రాయదుర్గానికి బదిలీ చేస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.