Share News

19వ రోజుకు అంగనవాడీల సమ్మె

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:31 AM

తమ న్యాయమైన డిమాండ్లను అమలుచేయాలని కోరుతూ అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది.

19వ రోజుకు అంగనవాడీల సమ్మె
రొద్దం సచివాలయంలో వినతిపత్రం ఇస్తున్న అంగనవాడీలు

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నిరసన

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

తమ న్యాయమైన డిమాండ్లను అమలుచేయాలని కోరుతూ అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. వారు తమ నిరసన కార్యక్రమాలను సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నిర్వహించారు. హిందూపురం, మడకశిర, పెనుకొండ పట్టణాలతో పాటు సోమందేపల్లి, లేపాక్షి, చిలమత్తూరు, గోరంట్ల, రొళ్ల, అగళి, గుడిబండ తదితర మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా అంగన వాడీల యూనియన నాయకులు మాట్లాడుతూ.... అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. మినీ సెంటర్లను మెయిన సెంటర్లుగా మార్చాలన్నారు. అన్ని యాప్‌లను కలిసి ఒకే యాప్‌గా మార్చాలని డిమాం డ్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దు చేయాలన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలనే తమ పలు డిమాండ్లలను వెంటనే నెరవేర్చాలన్నారు. తమ సమస్యలను పరిష్కచించే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తేలేదన్నారు. తమ సమస్యలను అధికార వైసీపీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అనంతరం వివిధ డమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయా సచివాలయాల్లో సిబ్బందికి అందజేశారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Updated Date - Dec 31 , 2023 | 12:31 AM