Share News

మలుపుల్లో ప్రమాదాలు

ABN , First Publish Date - 2023-10-30T00:57:06+05:30 IST

ప్రధాన రహదారుల్లో మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఎంతో మంది గాయపడుతున్నా, కొందరు చనిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అతి వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని నిర్ధారిస్తున్నారేగాని, వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు.

మలుపుల్లో ప్రమాదాలు
హనుమాన నగర్‌ మలుపు

నియంత్రణ పట్టని అధికారులు

ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా..?

ప్రధాన రహదారుల్లో మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఎంతో మంది గాయపడుతున్నా, కొందరు చనిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అతి వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని నిర్ధారిస్తున్నారేగాని, వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు.

- అనంతపురం రూరల్‌

- అనంతపురం-కళ్యాణదుర్గం ప్రధాన రహదారిలో పాపంపేట సర్కిల్‌ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీగా ఉండే ఈ సర్కిల్‌లో ఎంతో మంది గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. ఇదే రోడ్డులోని జొన్నా ఐరన మార్ట్‌ సమీపంలోని క్రాస్‌ కూడా ప్రమాదకరంగానే ఉంది. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

- అనంతపురం-ఉరవకొండ బైపాస్‌ రోడ్డు కూడా ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డులో దొంగల మోరీ క్రాస్‌, హనుమాన నగర్‌ సర్కిల్‌, పాత ఏపీ లైటింగ్‌, సిండికేట్‌ నగర్‌, రాచానపల్లి మలుపుల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.

తాత్కాలిక చర్యలతో సరి

అనంతపురం-కళ్యాణదుర్గం రోడ్డు, అనంతపురం-ఉరవకొండ రోడ్డు మీదుగా నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. అనంతపురం-ఉరవకొండ రోడ్డు నాలుగు లైన్ల రహదారి. కళ్యాణదుర్గం బైపాస్‌ సర్కిల్‌ నుంచి అక్కంపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు వేశారు. కానీ ఎక్కడా స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కళ్యాణదుర్గం బైపాస్‌ సర్కిల్‌ నుంచి సెయింట్‌ ఆన్స స్కూల్‌ వరకు తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల దుకాణాల కారణంగా రోడ్డు కనిపించకుండా పోయింది. రెండులైన్లకు ఎక్కువ, నాలుగులైన్లకు తక్కువ అన్న విధంగా రహదారి పరిస్థితి తయారైంది. ఒక వైపు సింగిల్‌ రోడ్డు మాత్రమే కనిపిస్తోంది. ఇలా ఆక్రమణల కారణంగానూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బళ్లారి బైపాస్‌ రోడ్డులో వేగ నియంత్రణ బోర్డులు డివైడర్ల మధ్యలో ఉన్న చెట్ల కారణంగా కనిపించకుండా పోయాయి. ఈ రెండు రహదారుల్లో వేగ నియంత్రణకు పోలీసులు ఇటీవల డ్రమ్ములు ఏర్పాటు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వాటివలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు స్పీడ్‌ బ్రేకర్లు వేయాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-10-30T00:57:06+05:30 IST