Kandukur: కొమ్మినేనికి ఊహించని షాక్‌!

ABN , First Publish Date - 2023-01-06T20:35:41+05:30 IST

గత నెల 28న కందుకూరులో జరిగిన తొక్కిసలాటపై వక్రభాష్యం చెప్పేందుకు వచ్చిన రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) కు ఊహించని షాక్‌ తగిలింది.

Kandukur: కొమ్మినేనికి ఊహించని షాక్‌!

కందుకూరు: గత నెల 28న కందుకూరులో జరిగిన తొక్కిసలాటపై వక్రభాష్యం చెప్పేందుకు వచ్చిన రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) కు ఊహించని షాక్‌ తగిలింది. పత్రికల రాతలు సరిగా ఉండటం లేదని ప్రభుత్వం, పోలీసులు భేషుగ్గా పని చేస్తున్నారని చెప్పేందుకు ఆపసోపాలు పడుతున్న కొమ్మినేనిని జర్నలిస్టులు ప్రశ్నలతో నిలదీయడంతో సరైన సమాధానం చెప్పలేక ‘‘నాకు చేతకాదు లెండి’’ అంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. కందుకూరు (Kandukur)లో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం మధ్యాహ్నం కొమ్మినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు, గుంటూరు (Guntur)లో జరిగిన దుర్ఘటనకు పోలీసులు, ప్రభుత్వం కారణమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, రాజకీయ పార్టీలు ఎలాంటి విమర్శలైనా చేస్తాయని కానీ.. పత్రికలు కూడా అలాగే రాస్తుండటం సరికాదని హితబోధ చేశారు.

గుంటూరులో వస్తువులు పంచుతామని పేదలను రప్పించి వారి ప్రాణాలు తీశారని అందుకు పోలీసులెలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులు జోక్యం చేసుకుని ‘‘పంపిణీ కార్యక్రమం రహస్యంగా జరగలేదు. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. కందుకూరులో కూడా అనుమతి తీసుకునే నిర్వహించారు. అలాంటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసులది కాదా’’ అని ప్రశ్నించారు. దీంతో ఏంటి పంపిణీ చేస్తామని పర్మిషన్‌ తీసుకున్నారా అని కొమ్మినేని ప్రశ్నించారు. ‘మీకు తెలియదా అని ఒక సీనియర్‌ జర్నలిస్టుగా, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా మీరు ఇలా మాట్లాడవచ్చునా’ అని విలేకరులు నిలదీశారు. దీంతో సమాధానం లేక తడబడిన ఆయన తాను మిమ్మల్ని రమ్మని పిలవలేదే ఎందుకొచ్చారని ప్రశ్నించారు.

Updated Date - 2023-01-06T20:35:43+05:30 IST